మాస్కో: ఉక్రెయిన్ తమ భూభాగంలో తొలి వైమానిక దాడి చేసిందని రష్యా ఆరోపించింది. బెల్గోరోడ్ నగరంలోని ఇంధన డిపోపై హెలికాప్టర్తో బాంబు దాడి చేసినట్లు పేర్కొంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలకు ఇది ఆటకం కలిగించవచ్చని హెచ్చరించింది. ఉక్రెయిన్ సరిహద్దుకు 40 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోడ్లో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు రష్యా తెలిపింది. రష్యా భూభాగంలోకి ప్రవేశించిన ఉక్రెయిన్ ఆర్మీ హెలికాప్టర్ అక్కడి పెట్రోల్ నిల్వ కేంద్రంపై బాంబు దాడులు చేసిందని ఆరోపించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడినట్లు బెల్గోరోడ్ ప్రాంత గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్కోవ్ పేర్కొన్నారు. 170 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేసినట్లు చెప్పారు. ఇంధన డిపోలో పని చేసే ఇద్దరు ఉద్యోగులు మంటల్లో గాయపడినట్లు టెలిగ్రామ్ ద్వారా వెల్లడించారు. సిబ్బందిని అక్కడి నుంచి వెంటనే ఖాళీ చేయించినట్లు రష్యా మంత్రిత్వశాఖ పేర్కొంది.
ఉక్రెయిన్పై రష్యా దాడి శుక్రవారంతో 37వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ ఎయిర్ఫోర్స్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు రష్యా ఇటీవల పదేపదే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యా భూభాగంలోని ఇంధన డిపోపై ఉక్రెయిన్ వైమానిక దాడి జరుపడం ప్రాధాన్యత సంతరించుకున్నది. కాగా, ఇరు దేశాల మధ్య జరుగుతున్న శాంతి చర్చలకు ఇది విఘాతం కలిగించవచ్చని రష్యా ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మీడియాతో అన్నారు.
మరోవైపు రష్యా కుతంత్రాలకు పాల్పడుతున్నదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. ఒకవైపు చర్చలంటూనే మరోవైపు దాడులను తీవ్రం చేస్తున్నదని విమర్శించారు. తాము తరిమికొడుతున్న ప్రాంతాలను వీడుతున్న రష్యా దళాలు కీలకమైన మిగతా ప్రాంతాలపై దృష్టిసారిస్తున్నాయని తెలిపారు. దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో పరిస్థితి చాలా కష్టంగా ఉందన్నారు. ఖార్కివ్, డాన్బాస్, మరియుపోల్ ప్రాంతాల్లో రష్యా దళాలు పెద్ద స్థాయిలో మోహరించాయని, దాడులను తీవ్రం చేస్తున్నాయని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో రష్యా దళాలను ఎదుర్కోవడం ఉక్రెయిన్కు చాలా కష్టమన్నారు.