ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ కలకల రేపుతోంది. రోజురోజుకూ ఈ వేరియంట్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథనీ ఫాసీ సూచించారు. ఒమిక్రాన్ను సమర్థవంతంగా ఎదుర్కొనాలనే ఉద్దేశ్యంతో బూస్టర్ డోస్ తీసుకున్నా కూడా మరిన్ని జాగ్రత్తలు పాటించాలని ఆయన చెప్పారు. ఎక్కువ మంది గుంపులుగా చేరే కార్యక్రమాలకు వెళ్లొద్దని హెచ్చరించారు.
ఇలా చేయడం వల్ల కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, బూస్టర్ డోస్ తీసుకున్న వారికి కూడా ఈ ప్రమాదం ఉంటుందని స్పష్టంచేశారు. ప్రాథమిక పరిశోధనల్లో డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ అంత ప్రమాదకరం కాదని తేలిందని ఆయన చెప్పారు. అయితే అమెరికన్లు జాగ్రత్తలు పాటించాలని, లేదంటే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.