న్యూఢిల్లీ: కరోనా వైరస్లో ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తున్నది. దాదాపు సగానికిపైగా దేశాలకు ఈ వేరియంట్ విస్తరిస్తున్నది. మన దేశంలోనూ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వేరియంట్పై యూకేలో చేసిన ఓ అధ్యయనం వెలుగులోకి వచ్చింది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనే దానిపై కొవిడ్-19 ట్రాకింగ్ స్టడీ పేరుతో తాజా అధ్యయనం జరిగింది.
ఒమిక్రాన్ సోకితే ప్రధానంగా ముక్కు కారడం, తలనొప్పి, వాంతికి వచ్చినట్లుగా, తలతిరిగినట్లుగా అనిపించడం, గొంతులో గరగర లాంటి లక్షణాలు కనిపిస్తాయని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రధాన లక్షణాలన్ని సాధారణ జలుబు లక్షణాలనే పోలి ఉంటాయని తెలిపింది. ఒమిక్రాన్ బారినపడిన వేలమంది నుంచి అభిప్రాయాలు సేకరించి తాజా నివేదికను సిద్ధం చేసినట్లు అధ్యయనకారులు చెప్పారు.
అయితే, ఇతర కరోనా వేరియంట్ల మాదిరిగా ఈ వేరియంట్ సోకిన వారిలో ఎడతెగని దగ్గు, తీవ్ర జ్వరం, వాసన కోల్పోవడం, రుచిని కోల్పోవడం లాంటి లక్షణాలేవి కనిపించలేదని అధ్యయనకారులు పేర్కొన్నారు. కాగా, ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో క్రిస్ మస్, న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర వేరియంట్లతో పోల్చుకుంటే ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నా దాన్ని తక్కువ అంచనా వేయకూడదని సూచిస్తున్నారు.