కొత్త వేరియంట్ విస్తృతిపై WHO హెచ్చరిక
జెనీవా: కరోనా న్యూ వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా ప్రజల ప్రాణాలు తీస్తున్నదని, అందుకే ఒమిక్రాన్ను ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందని, చాలా దేశాల్లో ఒమిక్రాన్ కేసులు డెల్టా కేసులను మించిపోయాయని WHO చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రియేసస్ హెచ్చరించారు. ఒమిక్రాన్ కేసుల కారణంగా చాలా దేశాల్లో ఆస్పత్రులు కిక్కిరిసిపోయాయని ఆయన తెలిపారు.
ప్రజల్లో ప్రత్యేకించి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా అనిపించినా దాన్ని తేలిగ్గా తీసుకుంటే ప్రమాదమని గెబ్రియేసస్ హెచ్చరించారు. గతంలో వచ్చిన వేరియంట్ల మాదిరిగానే ఒమిక్రాన్ కూడా భారీ సంఖ్యలో ప్రజలను ఆస్పత్రులపాలు చేస్తున్నదని, ప్రాణాలు తీస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తంచేశారు. గతవారం ప్రపంచవ్యాప్తంగా 95 లక్షల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, అంతకుముందు వారంతో పోల్చితే ఇది 71 శాతం ఎక్కువని WHO చీఫ్ వివరించారు.
వ్యాక్సినేషన్ లక్ష్యాలు నెరవేరడంలేదు..
ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతిపై 2022లో తొలి ప్రసంగం చేసిన టెడ్రోస్.. వ్యాక్సినేషన్ లక్ష్యాలను సక్రమంగా నెరవేరడం లేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. గత ఏడాది ధనిక దేశాలు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను తమ దగ్గరే అట్టిపెట్టుకున్నాయని, ఇది కరోనా మహమ్మారి వేగంగా విస్తరించడానికి కారణమైందని చెప్పారు. కొవిడ్ మరణాలకు, విధ్వంసానికి అడ్డుకట్ట వేయాలంటే 2022లోనైనా వ్యాక్సిన్లను పారదర్శకంగా ఇచ్చిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. 2021, సెప్టెంబర్ చివరికల్లా ప్రతిదేశం 10 శాతం మందికి, డిసెంబర్ చివరి నాటికి ప్రతి దేశం 40 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని లక్ష్యాలు నిర్దేశిస్తే.. 194 సభ్యదేశాల్లో కేవలం 92 దేశాలు మాత్రమే ఆ లక్ష్యాన్ని నెరవేర్చాయని చెప్పారు. 2022 ఏడాది సగం పూర్తయ్యేటప్పటికీ ప్రతి దేశం 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని టెడ్రోస్ సూచించారు.