వాషింగ్టన్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. డెల్టా వేరియంట్ కంటే అత్యంత వేగంగా ఇది వ్యాప్తిస్తున్నట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) శనివారం తెలిపింది. ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తి ప్రాంతాల్లో 1.5 నుంచి 3 రోజుల్లో కేసులు రెట్టింపవుతున్నాయని పేర్కొంది. ఒమిక్రాన్ బారిన పడిన 89 దేశాల్లో వైరస్ వ్యాప్తి తీరుకు సంబంధించిన నివేదికల ఆధారంగా ఈ మేరకు వెల్లడించింది. ఈ నేపథ్యంలో డెల్టా కేసులను ఇది దాటవచ్చని తెలిపింది.
ఒమిక్రాన్ కరోనా వేరియంట్ వైరస్ రోగ నిరోధక శక్తిని అధిగమిస్తుండటంతోనే వ్యాప్తి వేగంగా జరుతున్నదా అన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. అలాగే ఒమిక్రాన్ వేరియంట్ వల్ల కలిగే ముప్పు గురించి ఇప్పటి వరకు తక్కువ సమాచారం మాత్రమే అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. మరింత డేటా ఆధారంగానే ఈ వేరియంట్ ముప్పును పూర్తిగా అంచనా వేయగలమని అభిప్రాయపడింది.
అయితే ఒమిక్రాన్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య వ్యవస్థలపై మరోసారి భారం పడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) హెచ్చరించింది. ప్రస్తుతం బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో ఒమిక్రాన్ రోగులతో ఆసుపత్రులు నిండుతున్నట్లు పేర్కొంది.