లండన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ క్రమంలో మహమ్మారిపై అనేక దేశాల్లో శాస్త్రవేత్తలు పరిశోధనలు, అధ్యయనాలు ప్రారంభించారు. ఉత్పరివర్తనం తీవ్రతను తెలుసుకునేందుకు ప్రయత్నాలు వేగవంతం చేశారు. ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజీ (Imperial College research) పరిశోధన డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చనే విషయాన్ని వెల్లడించింది.
ఒమిక్రాన్ బారినపడ్డ మరింత మంది బాధితుల డేటాను విశ్లేషిస్తున్నామని పరిశోధకులు పేర్కొన్నారు. అంతే కాకుండా ఆసుపత్రుల్లో చేరిన రోగుల డేటాపై అధ్యయనాలు జరుగుతున్నాయన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ డేటాను పరిశీలించేందుకు శనివారం బ్రిటన్లో మంత్రుల అత్యవసర సమావేశం జరిగింది. కరోనాకు వ్యతిరేకంగా బూస్టర్ డోసులు ఒమిక్రాన్ నుంచి 85శాతం రక్షణ ఇవ్వగలవని ఓ అధ్యయనం పేర్కొంది.
డెల్టా వేరియంట్ (Delta Variant) కంటే ఒమిక్రాన్తో రీ ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ గతంలో ఇన్ఫెక్షన్ల కంటే 19శాతం తక్కువగా ఉంటుందని అధ్యయనం తెలిపింది. ఇంపీరియల్ కాలేజీ లండన్ అధ్యయనం యూకే హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, నేషనల్ హెల్త్ సర్వీస్ డేటా ఆధారంగా జరిగింది. అయితే, ఈ అధ్యయనాన్ని ఇంకా సమీక్షించలేదు. ఇప్పటి వరకు కొవిడ్ టీకా రెండో డోస్, బూస్టర్ డోస్ తీసుకోని వారికి డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్ చాలా ప్రమాదకరమని అధ్యయనం పేర్కొంది.