పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. పాక్లో దొంగల ప్రభుత్వం నడుస్తోందంటూ విరుచుకుపడ్డారు. పాక్లో ఈ దొంగల ప్రభుత్వాన్ని కొనసాగించే బదులు… పాక్పై ఓ ఆటంబాంబ్ వేసేస్తే సరిపోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మాజీ ప్రధాని ఇమ్రాన్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో రెచ్చిపోతున్న దొంగలను చూసి నేను షాక్ అవుతున్నా. ఈ దొంగల ప్రభుత్వాన్ని కొనసాగించే బదులు.. దేశంపై ఓ ఆటంబాంబ్ వేయడం ఉత్తమమేమో అంటూ వ్యాఖ్యానించారు.
ఈ దొంగలు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత పాక్లో వ్యవస్థలన్నీ భ్రష్టమైపోతున్నాయని ఇమ్రాన్ విరుచుకుపడ్డారు. చివరకు న్యాయవ్యవస్థను కూడా భ్రష్ఠు పట్టిస్తున్నారని ఇమ్రాన్ విమర్శించారు. ఈ క్రిమినల్స్పై ఏ ప్రభుత్వ అధికారి విచారణ చేపడతారో చెప్పాలని ప్రశ్నించారు.
ఇప్పటికే ప్రభుత్వ పెద్దల నుంచి తనకు ఎన్నో ఫోన్లు వచ్చాయని, కానీ.. వాటికి సమాధానం చెప్పలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. వాళ్ల నెంబర్లను తాను బ్లాక్ చేశానని చెప్పుకొచ్చారు. ఎన్నికల తేదీలు ప్రకటించే వరకూ తాను ఎవ్వరితోనూ మాట్లాడనని ఇమ్రాన్ ప్రకటించారు.