US-Iran talks : అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి తుది, సాంకేతిక అంశాలపై చర్చించేందుకు ఇరు దేశాలు సిద్ధమయ్యాయి. స్విట్జర్లాండ్ (స్విస్) వేదికగా జరగనున్న ఈ చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం స్విట్జర్లాండ్ చేరుకున్నారు. మిగతా అమెరికా ప్రతినిధులైన స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఇప్పటికే స్విస్లో ఉన్నారు. ఇరాన్ ప్రతినిధులు కూడా స్విట్జర్లాండ్ చేరుకున్నారు.
ఈ చర్చల్లో ఇరాన్, అమెరికాతోపాటు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్, ఖతార్ కూడా పాల్గొంటున్నాయి. ఈ చర్చల్ని సాంకేతికపరమైన అంశాలుగా పేర్కొంటున్నారు. ఆదివారమే ఈ చర్చలు జరిగే అవకాశం ఉంది. నిజానికి ఈ చర్చలు గత శుక్రవారమే జరగాలి. కానీ, లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ చర్చలకు నిరాకరించింది. దీంతో ఆదివారం మళ్లీ చర్చలు జరిగే ఛాన్స్ ఉంది. చర్చలు సానుకూలంగా సాగుతాయని ఆశిస్తున్నట్లు జేడీ వాన్స్ చెప్పారు. ఇరాన్ అణుకార్యక్రమంతోపాటు ప్రాంతీయ భధ్రత ప్రధానంగా ఈ చర్చలు జరుగుతాయి. ఇరాన్లోని అణుకేంద్రాలను ఐక్యరాజ్యసమితి కమిటీ తనిఖీ చేసేందుకు అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అలాగే, ఖతార్లో నిలిపివేసిన ఆరు బిలియన్ డాలర్ల ఇరాన్ డబ్బులను తీసుకునేందుకు అమెరికా అంగీకరించనుంది.
ఈ నిధుల్ని ఇరాన్ మానవతా అవసరాల కోసమే వాడాలని అమెరికా షరతు. అంటే, ఈ డబ్బులతో ఆహారం, మందులు వంటివి మాత్రమే ఇరాన్ కొనుగోలు చేయాలి. అలాగే, హార్ముజ్ జలసంధి నిర్వహణ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. వీటిన్నింటిపై ఈ రోజు చర్చలు జరిపి, సాంకేతికంగా ఒక ఒప్పందానికి రావాల్సి ఉంది.