బీజింగ్: మనుషులకే కాదు… చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. చైనాలోని జియామెన్లో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రస్తుతం చైనాలో విజృంభిస్తున్నది. ఈ వైరస్ గత కొన్ని నెలలుగా ఆ దేశంలో కలకలం రేపుతున్నది. జియామెన్లో కరోనా కేసులు పెరుగుతుండటంపై అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. మత్స్యకారులతోపాటు చేపలు, పీతలు వంటి సీ ఫుడ్కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో పీపీఈ కిట్లు ధరించిన ఆరోగ్య సిబ్బంది మత్స్యకారులతోపాటు సముద్రంలో వేటాడి తెచ్చిన చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు. వాటి నుంచి కూడా నమూనాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన వార్తలు, వీడియోలు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్లో వచ్చాయి. దీంతో ఈ వీడియో క్లిప్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా, మనుషులతోపాటు చేపలు, పీతలకు కూడా కరోనా పరీక్షలు చేయడంపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. చైనా అధికారుల తీరును కొందరు సమర్థించగా, మరికొందరు విమర్శించారు. అయితే తమ నిర్ణయాన్ని జియామెన్ మున్సిపల్ ఓషియానిక్ డెవలప్మెంట్ బ్యూరో అధికారులు సమర్థించుకున్నారు. కరోనా కల్లోలం రేపిన హైనాన్ నుంచి తాము పాఠం నేర్చుకున్నామని తెలిపారు. విదేశీయుల నుంచి మత్స్యకారులకు వైరస్ సోకి సముద్ర ఉత్పత్తులకు వ్యాపిస్తున్నదని చెప్పారు. అలాగే మనుషులకే కాకుండా ఇతర జీవులకు కరోనా పరీక్షలు చేయడం తామే తొలిసారి కాదంటూ తమ నిర్ణయంపై వస్తున్న విమర్శలను ఖండించారు.
Videos of pandemic medical workers giving live seafood PCR tests have gone viral on Chinese social media. pic.twitter.com/C7IJYE7Ses
— South China Morning Post (@SCMPNews) August 18, 2022