ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా మిస్సైళ్ల పరీక్షను కొనసాగిస్తూనే ఉన్నది. గుర్తు తెలియని ప్రొజెక్టైల్ను సముద్రంలో పరీక్షించినట్లు దక్షిణ కొరియా ఆరోపించింది. బహుశా అది బాలిస్టిక్ మిస్సైల్ అయి ఉంటుందని జపనీస్ కోస్ట్ గార్డులు తెలిపారు. అయితే ఈ ప్రయోగంపై ఇంత వరకు నార్త్ కొరియా నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. ఇటీవల వరుసగా నార్త్ కొరియా క్షిపణులను పరీక్షిస్తున్న విషయం తెలిసిందే. బాలిస్టిక్, అణ్వాయుధ సామర్ధ్యం కలిగిన క్షిపణి పరీక్షలు చేయవద్దు అంటూ ఆ దేశంపై ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించింది. అయితే ఈ ఏడాది ఉత్తర కొరియా నిర్వహించిన తొలి క్షిపణి పరీక్ష అని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణించిందని జపాన్ రక్షణ మంత్రి నోబువో కిషి తెలిపారు. వాస్తవానికి నార్త్ కొరియాలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. కరోనా ఆంక్షలతో ఆ దేశంతో దారిద్య్రం తాండవిస్తోంది. కానీ కిమ్ మాత్రం క్షిపణి పరీక్షలతో దూసుకెళ్తున్నారు. ఆ దేశంలోని చిన్నారులు, వృద్ధులు ఆకలి బాధలో ఉన్నట్లు ఇటీవల యూఎన్ తెలిపింది. అణ్వాయుధ పరీక్షలు ఆపాలంటూ ఆ దేశాన్ని యూఎన్ డిమాండ్ చేస్తూనే ఉన్నది.