ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా (North Korea) వరుసగా బాలిస్టిక్ క్షిపణులను (Ballistic missile) ప్రయోగిస్తున్నది. దక్షిణ కొరియా (South Korea), జపాన్ (Japan) అధ్యక్షులు సమావేశం కానున్న నేపథ్యంలో ఉత్తర కొరియా దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని (long-range ballistic missile) ప్రయోగించింది. కిమ్ కింగ్డమ్ గత ఆరు రోజుల్లో అణు క్షిపణులను పరీక్షించడం ఇది మూడోసారి. ఈ నెల 14న రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను తూర్పు తీర జలాల్లోకి ప్రయోగించిన విషయం తెలిసిందే. కాగా, గురువారం మరోసారి దీర్ఘ శ్రేణి బాలిస్టిక్ క్షిపణని ఉత్తర కొరియా ప్రయోగించిందని సియోల్ (Seoul) జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ప్యాంగ్యాంగ్లోని (Pyongyang) సునాన్ ఏరియాలో (Sunan area) దీనిని ప్రయోగించినట్లు తమ సైన్యం గుర్తించిందని, అది ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) అని పేర్కొన్నారు.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాన్ని జపాన్ రక్షణ శాఖ కూడా ధృవీకరించింది. కొరియన్ పీఠభూమికి 550 కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ ఎక్స్క్లూజివ్ ఎకనమిక్ జోన్ అవతల అది పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తమ నౌకా దళాన్ని అప్రమత్తం చేశామని ట్విట్టర్ వేదికగా తెలిపింది.
కాగా, మంగళవారం ఉదయం స్థానిక కాలమానం ప్రకారం ..7.41 గంటల నుంచి 10 నిమిషాల వ్యవధిలో రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపింది. అదనపు ప్రయోగాలకు సన్నాహకంగా తమ సైన్యం నిఘా, అప్రమత్తతను బలోపేతం చేసిందని జేసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది