ప్యోంగ్యాంగ్: ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఇవాళ పరస్పరం క్షిపణులను ఫైర్ చేశాయి. ఆ క్షిపణులు సమీప సముద్ర జలాల్లో పడ్డాయి. రెండు దేశాలు ఒకే రోజు మిస్సైళ్లను ప్రయోగించడం ఇదే మొదటిసారి. ఉత్తర కొరియా ఇవాళ ఉదయం ఓ మిస్సైల్ను పరీక్షించింది. ఆ క్షిపణి దక్షిణ కొరియాలోని సోక్చో నగరానికి సమీపంలో పడింది. అయితే దీనికి ప్రతీకారంగా మూడు గంటల తర్వాత దక్షిణ కొరియా మిస్సైళ్లను రిలీజ్ చేసింది. తమ భూభాగంలోకి ఉత్తర కొరియా క్షిపణులను రిలీజ్ చేస్తున్నట్లు దక్షిణ కొరియా ఆరోపించింది.
దక్షిణ కొరియా ఇవాళ మూడు ఎయిర్ టు గ్రౌండ్ మిస్సైళ్లను ఫైర్ చేసింది. ఆ క్షిపణులు నార్తర్న్ లిమిట్ లైన్ అవతల పడినట్లు తెలుస్తోంది. ఉత్తర, దక్షిణ కొరియా దేశాల మధ్య ఉన్న నార్తర్న్ లిమిట్ మార్క్ను మధ్య పాయింట్గా భావిస్తారు. కానీ ఆ బౌండరీని ఉత్తర కొరియా గుర్తించడంలేదు.
బుధవారం ఉత్తర కొరియా సుమారు 10 మిస్సైళ్లను పరీక్షించింది. తూర్పు, పశ్చిమ దిశల్లో ఆ ప్రయోగాలు సాగినట్లు దక్షిణకొరియా అధికారులు వెల్లడించారు. అమెరికా, సౌత్ కొరియా సైనిక విన్యాసాలను వ్యతిరేకిస్తూ ఉత్తర కొరియా ఈ క్షిపణి పరీక్షల్ని చేసింది.
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ అయిదేళ్ల తర్వాత తొలి అణ్వాయుధ పరీక్ష నిర్వహించేందుకు గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇవాళ ఉదయం ఉత్తర కొరియా మిస్సైల్ పరీక్ష తర్వాత ఉల్లెయింగ్ ప్రాంతంలో ఎయిర్ సైరన్లు మోగాయి. దక్షిణ కొరియా అధికారులు అప్రమత్తత ప్రకటించారు. అండర్గ్రౌండ్ షెల్టర్లకు వెళ్లిపోవాలంటూ ప్రజల్ని ఆదేశించారు.