స్టాక్హోం, అక్టోబర్ 4: ‘క్వాంటం డాట్స్’పై అద్భుతమైన పరిశోధనలు చేసిన ముగ్గురు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం దక్కింది. నానో టెక్నాలజీకి సంబంధించి ‘క్వాంటం డాట్స్’ ఆవిష్కరణలో పరిశోధనలకుగాను మౌంజి బావెండి, లూయిస్ ఇ బ్రస్, అలెక్సీ ఐ ఎకిమోవ్లను రసాయన శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వరించింది. ఈ మేరకు బుధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘క్వాంటమ్ డాట్స్ అనేవి.. అత్యంత సూక్ష్మమైన నానోపార్టికల్స్. టెలివిజన్, కంప్యూటర్ డిస్ప్లేలు, ఎల్ఈడీ బల్బులు సహా వివిధ పరికరాల్లో ఈ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. అంతేగాక ఈ టెక్నాలజీని వాడుతూ వైద్యులు కణితి తొలగింపు ఆపరేషన్లు కూడా చేస్తున్నారు’ అని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొన్నది. కాగా, విజేతల పేర్లను జ్యూరీ ప్రకటించక ముందే, స్వీడిష్ మీడియాలో లీక్ కావటం తీవ్ర కలకలం రేపింది.
కృత్రిమంగా సృష్టించిన అణువుల్ని ‘క్వాంటం డాట్స్’ అంటారు. సైంటిఫిక్గా ‘సెమీ కండక్టర్ నానోక్రిస్టల్స్’ అని కూడా పిలుస్తారు. వీటి పరిమాణం అత్యంత సూక్ష్మం. ఎంతంటే.. ఒక మీటర్ను 100 కోట్ల భాగాలుగా విడగొడితే, అందులో ఒక భాగం నానోమీటర్ అవుతుంది. ‘క్వాంటం డాట్స్’ విద్యుత్ ఆవేశాన్ని, పారదర్శక స్వభావాన్ని కలిగివుంటాయి. సెన్సార్లు, వైద్య పరికరాలు, ఇండస్ట్రియల్ క్వాలిటీ కంట్రోల్.. ఇలా అనేక విభాగాల్లో వీటిని వినియోగిస్తున్నారు. అత్యంత శక్తివంతమైన సోలార్ సెల్స్ను తయారు చేయగలిగామంటే దీనికి కారణం క్వాంటం డాట్స్. రేపటి తరం ఎల్ఈడీల తయారీకి ఇదే ప్రధానమైంది.