స్టాక్హోమ్, అక్టోబర్ 11: అమెరికాకు చెందిన ముగ్గురు ఆర్థిక వేత్తలు డేవిడ్ కార్డ్, జోషువా ఆంగ్రిస్ట్, గైడో ఇంబెన్స్లకు ఈ ఏడాదికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. కనీస వేతనాలు, వలసలు, విద్య… ఈ అంశాలు లేబర్ మార్కెట్పై ఎలా ప్రభావం చూపిస్తాయన్నదానిపై చేసిన పరిశోధనలకు నోబెల్ కమిటీ వీరిని ఎంపిక చేసింది. వీరి పరిశోధనలు సమాజంలో ఎన్నో మౌలిక ప్రశ్నలకు సమాధానాలు వెతకడానికి దోహదపడతాయని రాయల్ స్వీడిష్ అకాడమీ పేర్కొన్నది. ‘వలసలు.. వ్యక్తి జీతం, ఉద్యోగంపై ఎలా ప్రభావం చూపిస్తాయి.. దీర్ఘకాల విద్య భవిష్యత్తులో ఆదాయంపై ఎలా ప్రభావం చూపిస్తుంది.. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం చాలా కష్టం. కానీ, ఈ ముగ్గురు తమ అధ్యయనాలతో ఇలాంటి ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పడం సాధ్యమేనని నిరూపించార’ని తెలిపింది. డేవిడ్ కార్డ్ కాలిఫోర్నియా వర్సిటీలో పనిచేస్తున్నారు. నోబెల్ పురస్కారంతో అందించే నగదులో సగం కార్డ్కు చెందుతుంది. మిగతా సగం ఆంగ్రిస్ట్, ఇంబెన్స్కు వెళ్తుంది.