ఓస్లో, అక్టోబర్ 8: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇద్దరు జర్నలిస్టులకు లభించింది. ప్రజాస్వామ్య మనుగడ, శాంతి స్థాపనలో అత్యంత కీలకమైన ‘భావ ప్రకటనా స్వేచ్ఛ’ కోసం తమ రాతల ద్వారా పోరాటం చేస్తున్న మరియా రెసా, దిమిత్రి మురాటోవ్లకు నార్వేజియన్ నోబెల్ కమిటీ బహుమతి ప్రకటించింది. ‘అధికార దుర్వినియోగం, ఇతర దేశాలపై విద్వేష ప్రచారం నుంచి ప్రజలకు రక్షణ కల్పించడానికి స్వేచ్ఛాయుత, స్వతంత్ర జర్నలిజం అవసరం. భావ వ్యక్తీకరణ, పత్రికా స్వేచ్ఛ లేకుండా దేశాల మధ్య సౌభ్రాతృత్వం నెలకొల్పడం చాలా కష్టం’ అని కమిటీ చైర్ పర్సన్ బెరిట్ రీస్ అండర్సన్ ఈ సందర్భంగా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ వీరు భావ ప్రకటన స్వేచ్ఛకై ధైర్యంగా పోరాడుతున్నారని ప్రశంసించారు.
డ్యుటర్టె రక్తపాతంపై రెసా కథనాలు
రెసా ఫిలిప్పీన్స్కు చెందిన జర్నలిస్టు. ఆమె 2012లో రాప్లర్ పేరుతో న్యూస్ వెబ్సైట్ను ప్రారంభించారు. మాదక ద్రవ్యాలను నిరోధించడానికి డ్యుటర్టె సృష్టించిన రక్తపాతం, ఆయన హింసాయుత విధానాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. ఫేస్ న్యూస్ ప్రచారానికి ప్రభుత్వాలు సామాజిక మాధ్యమాలను ఎలా వినియోగిస్తున్నాయన్నదానిపై పరిశోధనాత్మక కథనాలు రాశారు.
మురాటోవ్ దశాబ్దాల పోరాటం
రష్యాలోనే అత్యంత స్వతంత్రత కలిగిన వార్తా పత్రిక నొవాజా గజెటా. 1993లో ఈ పత్రికను ప్రారంభించారు. ఈ పత్రిక వ్యవస్థాపకుల్లో మురాటోవ్ ఒకరు. మీడియా స్వేచ్ఛ కోసం ఆయన దశాబ్దాలుగా పోరాడుతున్నారు. దేశంలో అవినీతి, విధానపరమైన హింస, చట్ట వ్యతిరేక అరెస్టులు, ఎన్నికల్లో మోసాల్లాంటి ఎన్నో సంచలనాత్మక కథనాలు ప్రచురించారు.