దుబాయ్: ఇరాన్లోని అణు కేంద్రాల(Nuclear Facilities)కు నష్టం జరగలేదని తెలుస్తోంది. బుషెహర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, టెహ్రాన్ రీసర్చ్ రియాక్టర్ తో పాటు ఇతర అణు కేంద్రాలకు ఎటువంటి డ్యామేజ్ కాలేదని ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ అధిపతి రఫేల్ గ్రోసీ పేర్కొన్నారు. శనివారం అమెరికా-ఇజ్రాయిల్ దళాలు ఒక్క రోజే ఇరాన్పై సుమారు 2000 బాంబులతో దాడి చేశాయి. ఈ నేపథ్యంలో ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలకు ఏదైనా నష్టం జరిగిందేమో అన్న భయాందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ సందర్భంగా ఐఏఈఏ హెచ్ రఫేల్ గ్రోసీ ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ఇరాన్ న్యూక్లియర్ రెగ్యులేటరీ అథారిటీతో సంప్రదించే ప్రయత్నం చేస్తున్నామని, కానీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదని ఐఏఈఏ పేర్కొన్నది.
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ సైనిక ఆపరేషన్స్ వల్ల న్యూక్లియర్ సైట్లకు ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాలని రఫేల్ గ్రోసీ పిలుపునిచ్చారు. బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా దేశాల్లో ఉన్న అణు కేంద్రాలకు సమస్య లేదన్నారు. అయితే ఆదివారం నటాంజ్ న్యూక్లియర్ కేంద్రంపై దాడి జరిగినట్లు ఐఏఈఏకు చెందిన ఇరాన్ అంబాసిడర్ రీనా నజాఫి పేర్కొన్నారు.కానీ ఆ ఘటనకు చెందిన పూర్తి వివరాలను ఆయన వెల్లడించలేదు. అమెరికా-ఇజ్రాయెల్ దళాల దాడుల్లో ఇరాన్లోని కేంద్రాలకు ఏమీ కాలేదని యూఎన్ పేర్కొన్నది. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని, అన్ని దేశాలు సంయమనం పాటించాలని గ్రోసీ అన్నారు.