న్యూయార్క్: అమెరికాలో 5జీ టెక్నాలజీ పట్ల విముఖత వ్యక్తం అవుతోంది. 5జీ సేవలను విమానాశ్రయాల వద్ద వినియోగించవద్దు అని ఆ దేశ ప్రముఖ ఎయిర్లైన్స్ సంస్థలు వార్నింగ్ ఇచ్చాయి. ఎయిర్పోర్ట్ల వద్ద 5జీని వాడితే, దాంతో విమాన ప్రయాణ, రవాణా వ్యవస్థకు ప్రమాదం ఏర్పడుతుందని ప్రముఖ విమానయాన సంస్థలకు చెందిన సీఈవోలు తెలిపారు. ఈ నేపథ్యంలో వాళ్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 5జీని దేశవ్యాప్తంగా అమలు చేయండి కానీ, విమానాశ్రయ రన్వేలకు 2 కిలోమీటర్ల దూరం వరకు 5జీ వద్దు అని ఆ లేఖలో వాళ్లు కోరారు. దేశంలో సుమారు 48 విమానాశ్రయాల వద్ద ట్రాన్స్పాండర్ల ఏర్పాటుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
5జీ సీ బ్యాండ్తో విమాన ప్రయాణాలకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నట్లు ఎయిర్లైన్స్ ఆరోపించాయి. 5జీ ఏర్పాటు కోసం ఏటీ అండ్ టీతో పాటు వెరిజాన్ సంస్థలకు అనుమతి ఇచ్చారు. వాస్తవానికి జనవరి 19వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా 5జీ అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ విమాన సంస్థల ఆందోళనలతో 5జీ అమలు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. లేఖ రాసిన వారిలో యూపీఎస్ ఎయిర్లైన్స్, అలస్కా ఎయిర్, అట్లాస్ ఎయిర్, జెట్బ్లూ ఎయిర్వేస్, ఫెడ్ఎక్స్ ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వైట్హౌజ్కు ఆ లేఖను పంపారు.