పాకిస్తాన్లో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలపై ఎదురు తిరిగారు. 25 సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నానని, దేనికైనా తాను రెడీయే అంటూ ప్రతిసవాల్ విసరండంతో రాజకీయం మరింత వేడి రాజుకుంది. ప్రధాని ఇమ్రాన్ సర్కార్పై ప్రతిపక్షాలన్నీ కలిసి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చాయి. పైగా అల్టిమేటం కూడా జారీ చేశాయి. ప్రధానికి తాము రెండు ఆప్షన్లు ఇస్తున్నామని, ఒకటి రాజీనామా, లేదంటే అవిశ్వాసం ఎదుర్కోవడం.. ఈ రెండింటిలో దేనికి సిద్ధమంటూ విపక్షాలు ప్రధానికి సవాల్ విసిరాయి.
దీటుగానే జవాబిచ్చిన ప్రధాని ఇమ్రాన్
విపక్ష సవాల్కి ప్రధాని ఇమ్రాన్ సోమవారం ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా తీవ్రమైన హెచ్చరికలు కూడా జారీ చేశారు. తనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం సక్సెస్ కాదని ధీమా వ్యక్తం చేశారు. అవిశ్వాస తీర్మానంలో ప్రతిపక్షాలు ఓడిపోతే.. అందుకు తగ్గ మూల్య చెల్లించుకోవడానికి కూడా మానసికంగా సిద్ధంగా ఉండాలని ఇమ్రాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ’25 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో వున్నా. వారికి వ్యతిరేకంగా పోరాడుతూనే వున్నా. చివరి ఊపిరి వరకూ పోరాడతా. వారిని ధైర్యంగా ఎదుర్కొంటా. వారేం చేసినా నాకేమీ ఇబ్బంది లేదు. కానీ ఆ దొంగల ముఠాకి ఒక్కటే చెప్పదల్చుకున్నా. అవిశ్వాస తీర్మానంలో మీరు ఓడితే.. జరగబోయే పరిణామాలకు మాత్రం సిద్ధంగా ఉండాలి’ అంటూ ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు.
విదేశీ ప్రయాణాలు కుదరవ్.. ఎంపీలకు సూచనలు
ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి విపక్షాలు సర్వం సిద్ధం చేసుకున్నాయి. వారి వారి సభ్యులకు కూడా పలు సూచనలు చేశారు. ఎవరైనా.. విదేశీ యానం పెట్టుకుంటే.. వెంటనే క్యాన్సల్ చేసుకోవాలని పీపీపీ, పీఎంఎల్ఎన్ పార్టీలు తాజాగా హుకూం జారీ చేశాయి. ఎంపీలందరూ ఇస్లామాబాద్లోనే అందుబాటులో ఉండాలని పీపీపీ అధినేత భుట్టో జర్దారీ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలను కూడా వాయిదా వేసుకోవాలని సూచించారు.