Newlyweds | ఓ జంట పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వివాహ రిసెప్షన్ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా మంచి వేదికను ఏర్పాటు చేసి, సుందరంగా అలంకరించారు. ఇక నూతన వధూవరులతో పాటు 30 మంది అతిథులు వేదికపై నిల్చున్నారు. ఇందులో కొందరు డ్యాన్స్ చేస్తుండగా వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో నవ దంపతులతో పాటు పలువురు గాయపడ్డారు. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది.
ఇటలీకి చెందిన పౌలో ముగ్నైని, వాలేరియా యబర్రా వివాహం చేసుకున్నారు. ఇటీలోని పిస్తోయియాలో ఏర్పాటు చేసిన వెడ్డింగ్ రిసెప్షన్ పార్టీకి 150 మంది అతిథులను ఆహ్వానించారు. వేదికపై నూతన వధూవరులతో పాటు 30 మంది దాకా అతిథులు ఉన్నారు. వారు డ్యాన్స్ చేస్తుండగా వేదిక కూలిపోయింది. దీంతో అందరూ చెక్కల మధ్య ఇరుక్కుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాలను తొలగించి, గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. క్షతగాత్రులందరూ పిస్తోయియాలోని శాన్ జకోపో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ సందర్భంగా పెళ్లి కుమారుడు ముగ్నైని మాట్లాడుతూ.. వేదిక కుప్పకూలే కంటే ముందు అందరం సంతోషంగా ఉన్నాం. ఏమైందో ఏమో కానీ.. సడెన్గా వేదిక కూలిపోయింది. నేను కూడా పడిపోయాను. నాపై చాలా మంది పడ్డారు. అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. నా ముందు నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. అతన్ని పిలిస్తే పలకలేదు. అతని తల నుంచి రక్తం కారుతుంది. దీంతో మరింత భయపడిపోయి నా భార్య వాలేరి కోసం వెతికాను. కానీ కనిపించకపోయే సరికి తీవ్ర ఆందోళనకు గురయ్యాను. చివరకు ఇద్దరం కలిసి హాస్పిటల్లో చేరామని, పక్కపక్క బెడ్లో ఉండి చికిత్స పొందుతున్నామని తెలిపారు.