కరాచీ: పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సులో దారుణం జరిగింది. ఓ హెల్త్ సెంటర్లో గర్భంలో ఉన్న శిశువు తలను కోసేసి ఆ భాగాన్ని కడుపులోనే వదిలేశారు. 32 ఏళ్ల మహిళ పట్ల అక్కడి వైద్య సిబ్బంది ఇలా వ్యవహరించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. తీవ్ర విషాదాన్ని కలిగించిన ఈ ఘటన పట్ల సింధు ప్రభుత్వం వైద్య విచారణకు ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే..
థార్పార్కర్ జిల్లాలో ఉన్న ఓ గ్రామీణ ఆరోగ్య కేంద్రానికి పురుడు పోసుకునేందుకు మహిళ వెళ్లింది. అయితే అక్కడ మహిళా గైనకాలజీ వైద్యులు లేరు. అనుభవం లేని సిబ్బంది వల్ల ఆ మహిళకు అష్టకష్టాలే మిగిలినట్లు లియాకత్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాహీల్ సికిందర్ తెలిపారు. శిశువును గర్భం నుంచి తీసే సమయంలో హెల్త్ సెంటర్ సిబ్బంది సరైన రీతిలో ఆపరేషన్ చేయలేకపోయారు. ఆ శిశువు తలను కోసేసి ఆ మహిళ గర్భంలోనే వదిలేశారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆమెను సమీపంలో ఉన్న హాస్పిటల్కు తీసుకువెళ్లారు. లియాకత్ వర్సిటీ హాస్పిటల్లో ఆపరేషన్ చేసి ఆ మహిళ గర్భంలో ఉన్న మిగితా శరీరాన్ని బయటకు తీశారు.
శిశువు తల మహిళ గర్భంలో ఇరుక్కుపోయిందని, ఆ మహిళ మూత్రాశయం కూడా దెబ్బతిన్నదని, ఆమెను కాపాడేందుకు సర్జరీ చేయాల్సి వచ్చిందని, శిశువు తలను సర్జరీ చేసి బయటకు తీసినట్లు ప్రొఫెసర్ సికందర్ తెలిపారు. ఈ కేసు పట్ల సింధు ఆరోగ్యశాఖ డీజీ డాక్టర్ జుమాన్ భాటో విచారణకు ఆదేశించారు.