న్యూయార్క్: మంచు తుఫాన్తో అమెరికా గడ్డకట్టుకుపోతున్నది. భీకరంగా కురుస్తున్న మంచు వల్ల.. రోడ్లన్నీ స్తంభించిపోయాయి. న్యూయార్క్ రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక ఆ రాష్ట్రంలో ఇప్పటికే 28 మంది మంచు తుఫాన్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. బఫెలో నగరంలో పరిస్థితి మరింత భయానకంగా ఉంది. ఆ రాష్ట్రంలోనే ఎక్కువ సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
వేల సంఖ్యలో వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయి. రోడ్లన్నీ మంచుతో నిండుకుపోవడంతో.. ఆ వాహనాలు ఎటూ కదలడం లేదు. ఎమర్జెన్సీ వాహనాలు కూడా మంచు రోడ్డుపైనే స్తంభించిపోయాయి. చాలా మంది గుండె సంబంధిత సమస్యలతో ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్నారు. కొందరైతే వాహనాల్లోనే ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది.
రోడ్డుపై వాహనాలు నిలిచి ఉన్న తీరు షాకింగ్గా ఉందని ఆ రాష్ట్ర గవర్నర్ కేథీ హోచుల్ తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో ఆ వాహనాల నుంచి మరింత మంది బాధితులు బయటపడే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఎమర్జెన్సీ సహాయం చేసేందుకు వీలులేని రీతిలో అక్కడ రోడ్లపై మంచు పేరుకుపోయింది.