న్యూఢిల్లీ, జూలై 8: ఎబోలా, కరోనా, మంకీపాక్స్ను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్న సమయంలో మరో ప్రాణాంతక వైరస్ వెలుగు చూసింది. ఆఫ్రికాలోని ఘనాలో మార్బర్గ్ వైరస్ను కనుగొన్నారు. రెండు వారాల క్రితం ఈ వైరస్ సోకిన ఇద్దరు బాధితులు తాజాగా మరణించారు. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ధ్రువీకరించింది. ఎబోలా కుటుంబానికి చెందినదే మార్బర్గ్ వైరస్.
గబ్బిలాల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు/మనుషుల స్రావాలను నేరుగా తాకడం వల్ల సంక్రమిస్తుంది. వైరస్ సోకిన రెండు నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. జ్వరం, రక్త విరేచనాలు, చిగుళ్ల నుంచి రక్తం కారడం, శరీరంలో అంతర్గత రక్తస్రావం, కండ్లు ఎర్రబడటం, మూత్రంలో రక్తం, తలనొప్పి, ఆయాసం వంటివి లక్షణాలుగా ఉంటాయి. మరణాల రేటు 88 శాతం వరకూ ఉంటుంది.