Gold shifting : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం (Nedarlands Govt) అత్యంత కీలక నిర్ణయాన్ని అమలు చేసింది. అమెరికా (USA), కెనడా (Canada) దేశాల్లో నిల్వ ఉంచిన తమ 86 టన్నుల పసిడి నిల్వలను బ్రిటన్ రాజధాని లండన్ (Landon) లోని ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (Bank of England)’ వాల్ట్కు విజయవంతంగా తరలించినట్లు డచ్ సెంట్రల్ బ్యాంక్ (Centrel Bank) అధికారికంగా ధ్రువీకరించింది.
సంక్షోభ సమయంలో ఈ పసిడిని అత్యంత వేగంగా ట్రేడింగ్ చేయడానికి, నగదు రూపంలోకి మార్చుకోవడానికి వీలుగానే ఈ క్లిష్టమైన ఆపరేషన్ను పూర్తి చేసినట్లు బ్యాంక్ గవర్నర్ ఒలాఫ్ స్లీపెన్ వెల్లడించారు. ఈ భారీ తరలింపు ప్రక్రియను ఈ ఏడాది మార్చి నుంచి ఆగస్టు మధ్య కాలంలో రెండు విభిన్న పద్ధతుల్లో అత్యంత జాగ్రత్తగా నిర్వహించారు. మొదటగా అమెరికా, కెనడాలలోని బ్యాంకుల నుంచి సుమారు 27 టన్నుల భౌతిక (ఫిజికల్) బంగారాన్ని నెదర్లాండ్స్లోని జైస్ట్ (Zeist) ప్రాంతానికి తీసుకొచ్చి, అక్కడి నుంచి లండన్లోని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్కు భద్రంగా చేర్చారు.
ఇక మిగిలిన పసిడికి సంబంధించి రవాణా ప్రమాదాలను తగ్గించేందుకు న్యూయార్క్లో ఉన్న గోల్డ్ బార్లను అక్కడే విక్రయించి, సమాన పరిమాణంలోని అంతర్జాతీయ ప్రామాణిక బంగారాన్ని తిరిగి లండన్ మార్కెట్లో కొనుగోలు చేశారు. ఈ విధానంవల్ల బంగారాన్ని కరిగించాల్సిన అవసరం లేకుండానే సమర్థవంతంగా లండన్కు తరలించడం సాధ్యమైంది. ప్రస్తుతం అమెరికా-కెనడా మధ్య నడుస్తున్న వాణిజ్య పోరు, పశ్చిమాసియాలో ఇరాన్ ఉద్రిక్తతలు, అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ఆందోళనల మధ్య డచ్ బ్యాంక్ ఈ చర్యకు పూనుకోవడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత లిక్విడిటీ ఉన్న గోల్డ్ మార్కెట్గా లండన్ గుర్తింపు పొందింది. లండన్లోని ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ అధునాతన బాంబ్-ప్రూఫ్ వాల్ట్లలో ప్రపంచ పసిడి నిల్వల్లో దాదాపు ఐదో వంతు భద్రపరచబడి ఉంది. ఇక్కడ వివిధ దేశాల కేటాయింపులు పక్కపక్కనే ఉండటంతో అత్యవసర సమయాల్లో భౌతికంగా బంగారాన్ని రవాణా చేసే పనిలేకుండా, వాల్ట్లోని అరలు మార్చడం ద్వారానే వేల కోట్ల విలువైన అంతర్జాతీయ లావాదేవీలను క్షణాల్లో పూర్తి చేయడానికి వీలవుతుంది.