కాఠ్మాండు: నేపాలీ షెర్పా కామి రీటా(Kami Rita) చరిత్ర సృష్టించాడు. 30వ సారి ఎవరెస్ట్ పర్వతాన్ని అతను అధిరోహించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆ శిఖారినికి గడిచిన పది రోజుల్లోనే అతను రెండోసారి చేరుకున్నాడు. ఈ సీజన్లో రెండు సార్లు ఎవరెస్ట్ ఎక్కి కొత్త రికార్డును అతను నెలకొల్పాడు. 54 ఏళ్ల కామి రీటా ఇవాళ ఉదయం 7.49 నిమిషాలకు ఎవరెస్ట్ శిఖరానికి చేరుకున్నాడు. మే 12వ తేదీన కామి రీటా ఎవరెస్టుపైకి 29వ సారి చేరుకున్నాడని, ఇవాళ 30వ సారి అతను శిఖరాన్ని ఎక్కినట్లు పేర్కొన్నాడు.
మౌంట్ ఎవరెస్టును అతను తొలిసారి మే 1994లో ఎక్కాడు. జనవరి 17, 1970 లో కామి రీటా జన్మించాడు. పర్వతారోహణను అతను 1992లో ప్రారంభించాడు. యుక్త వయసు నుంచే అతను మౌంటనేరింగ్పై దృష్టి పెట్టాడు. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి అతను పర్వతాలను అధిరోహిస్తున్నాడు. ఎవరెస్ట్తోపాటు మౌంట్ కే2, చో ఓయూ, లోత్సే, మనస్లూ పర్వతాలను కూడా ఎక్కేశాడు.
కామి రీటాకు పోటీలో 46 ఏళ్ల పసంద్ దవా షెర్పా ఉన్నాడు. అతను ఇప్పటి వరకు ఎవరెస్టును 27 సార్లు అధిరోహించాడు. ఈ సీజన్లో ఎవరెస్ట్ను ఎక్కేందుకు మొత్తం 414 మంది అనుమతి తీసుకున్నారు. 1953 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. ఇప్పటి వరకు ఏడు వేల మంది ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కారు. మరో 300 మంది ప్రాణాలు కోల్పోయారు.