ఖాట్మండు: నేపాల్లో అధ్యక్ష ఎన్నికల నగారా మోగింది. ఈ నెల 9న అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు నేపాల్ ఎన్నికల సంఘం ప్రకటించింది. అదేవిధంగా మార్చి 17న ఉపాధ్యక్ష పదవికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నది. ఈ మేరకు నేపాల్ ఎన్నికల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది.
నేపాల్ అధ్యక్షురాలు విద్యాదేవి భండారి పదవీకాలం మార్చి 13న ముగియనుంది. దాంతో ఆ గడువుకు నాలుగు రోజుల ముందే అధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక నేపాల్ ఉపాధ్యక్షుడు నంద బహదూర్ పూన్ పదవీకాలం మార్చి 18న ముగియనుండగా.. అంతకు ఒక్కరోజు ముందు ఉపాధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి.
నేపాల్ అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. నేపాల్ ఫెడరల్ పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు, ఏడు ప్రావిన్షియల్ అసెంబ్లీల సభ్యులు ఈ ఎలక్టోరల్ కాలేజీలో ఉంటారు. ఫెడరల్ పార్లమెంట్ సభ్యుల ఓటు విలు, ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యుల ఓటు విలువలు వేర్వేరుగా ఉంటాయి.
నేపాల్ గణతంత్ర దేశంగా అవతరించిన తర్వాత ఆ దేశానికి విద్యాదేవి భండారీ రెండో ప్రెసిడెంట్. మొదటి మహిళా అధ్యక్షురాలు. నేపాల్ తొలి అధ్యక్షుడిగా రామ్ బరన్ యాదవ్ బాధ్యతలు నిర్వహించారు. విద్యాదేవి భండారీ 2015 అక్టోబర్ 28న తొలిసారి నేపాల్ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2018 మార్చి 13న ఆమెను రెండోసారి అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు.