కాట్మాండు: నేపాల్ వరదల్లో పలు జల విద్యుత్తు కేంద్రాలు(Nepal Hydropower) కొట్టుకుపోయాయి. అయితే అక్కడ ఉన్న టన్నెల్స్లో వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకున్నట్లు గుర్తించారు. బురద సునామీ వల్ల ఆ టన్నెల్స్ అన్నీ మూసుకుపోయాయి. అయితే రసువా జిల్లాలోని త్రిశూలీ-3ఏ హైడ్రోపవర్ సైట్ వద్ద ఉన్న టన్నెల్లో సుమారు 933 మంది కార్మికులు ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఆ టన్నెల్స్లోకి వెళ్లేందుకు చాలా కంట్రోల్డ్ బ్లాస్టింగ్ చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు ఆ బ్లాస్టింగ్ చేపట్టారు. టన్నెల్ యాక్సెస్ కోసం ఆ బ్లాస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
హైడ్రోపవర్ సైట్ వద్ద ప్రధాని ఆదేశాల ప్రకారం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ప్రధానమంత్రి కార్యాలయం పేర్కొన్నది. జేసీబీల ద్వారా సుమారు 10 మీటర్ల గొయ్యిను ఓ ప్రదేశంలో తొవ్వారు. బురద, రాళ్లతో నిండిన ప్రదేశాన్ని నేపాలీ ఆర్మీ శుభ్రం చేస్తున్నది. త్రిశూలీ-3ఏ టన్నెల్లోకి ప్రవేశించేందుకు క్లీనింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఓ టన్నెల్ నుంచి శుక్రవారం 191 మందిని, శనివారం మరో టెన్నెల్ నుంచి 88 మందిని రక్షించినట్లు నేపాల్ డిజాస్టర్ ఏజెన్సీ పేర్కొన్న విషయం తెలిసిందే. టన్నెల్స్ నుంచి సురక్షితంగా బయటకు వచ్చిన వారు.. టన్నెల్స్లో మరింత మంది సజీవంగా ఉన్నట్లు చెప్పారు.
టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ కోసం విదేశీ బృందాలు కూడా రంగంలోకి దిగాయి. హైడ్రోపవర్ ప్రాజెక్టుల వద్ద ఉన్న టన్నెల్స్ను లొకేట్ చేసి, వాటిల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రసువాగాధీ హైడ్రోపవర్ ప్రాజెక్టులో ఆర్మీ సిబ్బంది వెళ్లారు. కానీ ఎవర్నీ గుర్తించలేకపోయారు. డ్రోన్ల సాయంతో టన్నెల్స్ను పరీక్షిస్తున్నారు. అప్పర్ త్రిశూలీ 1, త్రిశూలీ 3ఏ, త్రిశూలీ 3బీ టన్నెల్స్లోనూ సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. భారత్ , చైనా, దక్షిణ కొరియాకు చెందిన రెస్క్యూ బృందాలు ఈ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. సాంకేతిక అంశాల్లో చాలా సాయం కావాల్సి ఉంటుందని నేపాల్ ప్రభుత్వం పేర్కొన్నది. మృతదేహాల డీఎన్ఏ గుర్తింపు కూడా కష్టమైన పని అని పేర్కొంటున్నారు.