మాస్కో: ఉక్రెయిన్లోని మరియపోల్లో ఉన్న అజోవ్ స్టీల్ ప్లాంట్లో చాన్నాళ్ల నుంచి భీకర పోరు సాగుతున్న విషయం తెలిసిందే. ఆ ప్లాంట్లో తలదాచుకున్న వారిని సురక్షితంగా తరలించేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగాయి. ఇటీవల ఆ ప్లాంట్ను రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ స్టీల్ ప్లాంట్లో ఉన్న సుమారు వెయ్యి మందికి పైగా అజోవ్ ఫైటర్లు లొంగిపోయినట్లు ఇవాళ రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్ మిలిటరీకి చెందిన 694 మంది ఫైటర్లతో పాటు అజోవ్ బెటాలియన్ కూడా సరెండర్ అయినట్లు రష్యా తెలిపింది. ఇప్పటి వరకు సరెండర్ అయిన వారి మొత్తం సంఖ్య 959గా ఉంది. స్టీల్ ప్లాంట్ నుంచి వస్తున్న వారిని రష్యా తమ ఆధీన ప్రాంతాలకు తరలిస్తోంది. అజోవస్తల్ ప్లాంట్ నుంచి ఎంత మంది ఫైటర్లు వెళ్లిపోయారన్న విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు ఇంకా వెల్లడించలేదు. కానీ టాప్ కమాండర్లు ఇంకా ప్లాంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
డినాజిఫికేషన్..
డీ నాజిఫై చేసేందుకు ఉక్రెయిన్పై ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు అధ్యక్షుడు పుతిన్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే అజోవ్ ఫైటర్లను రష్యా దళాలు స్వాధీనం చేసుకోవడమంటే, ఒకరకంగా పుతిన్ తన డినాజిఫికేషన్ వాదనలో నెగ్గినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నియో నాజీలు, ఫాసిస్టులు, అల్ట్రా నేషనలిస్టులతో ఉక్రెయిన్ నడుస్తోందని కూడా రష్యా ఆరోపణలు చేసింది. అజోవ్ దళాలకు కేంద్ర బిందువైన మరియపోల్ ఇప్పుడు రష్యా వశం కావడంతో అది పుతిన్కు కలిసివచ్చే అంశమే అవుతుంది. స్టీల్ ప్లాంట్ నుంచి అజోవ్ ఫైటర్లను పట్టుకుని ఖైదీలుగా మార్చిన పుతిన్.. ఇప్పుడు వాళ్లను యుద్ధ నేరస్థులుగా విచారణ జరిపే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒకరకంగా డినాజిఫికేషన్ అన్న వాదనకు సరిపోతుంది. ఇటీవల రష్యాకు చెందిన పాపులర్ పత్రిక ఒకటి తన కథనంలో ఉక్రెయిన్ వార్లో స్వల్ప విక్టరీ సాధించినట్లు రాసింది. అంటే లుహన్స్క్, డోనస్కీ ప్రాంతాల్లో రష్యా పట్టు సాధించినట్లు స్పష్టమవుతోంది. ఒడిసా, డిప్రో పట్టణాలను కూడా చేజిక్కించుకున్నట్లు ఆ పత్రికలో రాశారు.