ఇస్లామాబాద్: వచ్చే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ గెలిస్తే పాకిస్థాన్ ప్రధాని పీఠంపై తన సోదరుడు, ‘పాకిస్థాన్ ముస్లిం లీగ్ – నవాజ్ (PML-N)’ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూర్చుంటారని పాకిస్థాన్ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ చెప్పారు. రాబోయే జనరల్ ఎన్నికల్లో తమ పార్టీ (PML-N) కచ్చితంగా గెలుస్తుందని షెహబాజ్ ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే కొన్ని వారాల్లో తన సోదరుడు నవాజ్ షరీఫ్ పాకిస్థాన్కు తిరిగి రానున్నాడని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. దేశంలోని పరిస్థితుల కారణంగా నవాజ్ షరీఫ్ దేశం విడిచిపెట్టిపోయి 2019 నుంచి లండన్లో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తన సోదరుడు పాకిస్థాన్కు తిరిగి రానున్నాడు, పాకిస్థాన్కు మరోసారి ప్రధాని కానున్నాడు అని షెహబాజ్ షరీఫ్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది.