ఇస్లామాబాద్: పాకిస్థాన్ పార్లమెంట్ ఇవాళ ప్రారంభమైంది. అయితే ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. ఇటీవల మృతిచెందిన నేతలకు నివాళి అర్పించిన తర్వాత జాతీయ అసెంబ్లీ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేశారు. ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని మార్చి 8వ తేదీన ప్రతిపక్షాలు అభ్యర్థన పత్రాన్ని సమర్పించాయి. సుమారు 152 మంది ప్రతిపక్ష సభ్యులు ఆ తీర్మానంపై సంతకం చేశారు. అయితే ఇవాళ పార్లమెంట్ మొదటి రోజు నేపథ్యంలో ఇటీవల మృతిచెందిన నేతలకు నివాళి అర్పించారు. ఆ తర్వాత సభా కార్యకలాపాలను వాయిదా వేశారు. మార్చి 28వ తేదీన ఇమ్రాన్పై అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి.
పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 95 ప్రకారం అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగనున్నది. దానిపై ఓటింగ్ జరగాలంటే, ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టి మూడు రోజులై ఉండాలి. ఓటింగ్ కోసం ఏడు రోజుల వ్యవధి దాటకూడదు. ఒకవేళ తీర్మానికి మెజార్టీ సభ్యులు ఓకే చెబితే అప్పుడు ప్రధాని తన బాధ్యతల్ని వదులుకోవాల్సి వస్తుంది.