న్యూయార్క్: బుల్లెట్ కంటే పది రెట్లు వేగంతో, రోజుకు 16 సార్లు భూమిని చుట్టేస్తూ.. ఇప్పటివరకూ పదిలక్షలకు పైగా రోదసి చిత్రాలను తీసిన అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని (ఐఎస్ఎస్) మరో దశాబ్దంలో కూల్చివేయనున్నారు. ఈ మేరకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా వెల్లడించింది.
15 ఏండ్లపాటు సేవల కోసం ఐఎస్ఎస్ను 1998లో ప్రయోగించారు. అయితే, ఇప్పటికీ అది సేవలను అందిస్తున్నది. మరో పదేండ్లపాటు కూడా అది పనిచేయగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాత దాని పనితీరు సన్నగిల్లుతుందని అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు ఐఎస్ఎస్ ఆధునిక వెర్షన్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ను ఇటీవలే విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. దాని సేవలు కూడా ప్రారంభమయ్యాయి. అందుకే ఐఎస్ఎస్ను ధ్వంసం చేయాలని నిర్ణయించారు.
భూస్థిర కక్ష్యలోని ఐఎస్ఎస్ను అక్కడే ధ్వంసం చేయాలని తొలుత భావించారు. అయితే, ఫుట్బాల్ మైదానం సైజులో ఉన్న దీన్ని కూల్చేస్తే రోదసిలో భారీగా శకలాల వ్యర్థాలు చేరవచ్చని అభిప్రాయానికి వచ్చారు. దీంతో మిగతా రాకెట్లు, ఉపగ్రహాలలాగా మండించకుండా.. ఐఎస్ఎస్ శకలాలను దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలోని పాయింట్ నెమో ప్రాంతంలో పడేయనున్నారు. 2031 జనవరిలో ఐఎస్ఎస్ను దశల వారీగా కూల్చివేయనున్నట్టు నాసా ప్రకటించింది. ‘పాయింట్ నెమో’ ప్రాంతాన్ని వ్యోమనౌకల శ్మశానవాటికగా పిలుస్తారు. ఈ ప్రాంతం దరిదాపుల్లో మానవ ఆవాసాలు ఏమీ ఉండవు. అందుకే పాడైపోయిన రాకెట్లు, కాలంచెల్లిన ఉపగ్రహాలను కూడా ఇక్కడ కూల్చేస్తారు.