వాషింగ్టన్, మార్చి 19: పశ్చిమాసియాలో ఇరాన్తో యుద్ధం కారణంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ నివాసాల వద్ద డ్రోన్లు కలకలం సృష్టించాయి. మంత్రుల నివాసాలతో పాటు అమెరికా సైనిక స్థావరం కూడా అయిన ఫోర్ట్ లెస్లీ జే, మెకనైర్ మీదుగా గుర్తు తెలియని డ్రోన్లు ఎగురుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో భద్రతా చర్యలు పటిష్ఠం చేశారు. అయితే ఇవి ఏ దేశానికి చెందిన డ్రోన్లో అధికారులు కనిపెట్ట లేకపోయారు. మిలిటరీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నదని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
డ్రోన్ల కదలికలపై అప్రమత్తమైన అమెరికా దేశంలోని తమ మిలిటరీ స్థావరాల భద్రతను ముమ్మరం చేసింది. డ్రోన్ల కదలికల అనంతరం మంత్రులు మెకనైర్, పీట్ హెగ్సెత్లను వేరే ప్రాంతాలకు తరలించేందుకు యోచిస్తున్నారని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ప్రస్తుతానికైతే వారు తమ పాత నివాసాల్లోనే కొనసాగుతున్నారని పేర్కొన్నది. రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న క్రమంలో అమెరికా తన దౌత్య కార్యాలయాలకు ప్రపంచ వ్యాప్త భద్రతా హెచ్చరికలు జారీ చేసింది.