వాషింగ్టన్: తల్లీకూతుళ్లు చరిత్ర సృష్టించారు. పైలట్లు అయిన వారిద్దరూ కలిసి ఒకే విమానాన్ని నడిపారు. ఈ అరుదైన సంఘటన అమెరికాలో జరిగింది. హోలీ పెటిట్కు విమాన రంగం అంటే ఎంతో ఇష్టం. దీంతో డిగ్రీ అనంతరం ఆమె అందులో కెరీర్ను ఎంచుకున్నారు. తొలుత విమాన సహాయకురాలిగా పని చేశారు. ఒకవైపు పిల్లల ఆలనాపాలనా చూస్తూనే మరోవైపు పైలట్గా శిక్షణ పొందారు. అనంతరం విమాన పైలట్గా ఆమె రాణించారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో 18 ఏళ్లుగా పని చేస్తున్నారు.
మరోవైపు హోలి కుమార్తె కీలి పెటిట్ కూడా చిన్నప్పటి నుంచి పైలట్ కావాలనుకుంది. 2017లో ఆమె పైలట్ లైసెన్స్ పొందింది. అనంతరం తల్లి పని చేస్తున్న సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్లో ట్రైనీగా చేరింది. 2018 నుంచి పూర్తి స్థాయి పైలట్గా ఆ సంస్థలో పని చేస్తున్నది. ప్రస్తుతం ఫస్ట్ ఆఫీసర్గా ఉన్నది.
కాగా, తల్లీకూతుళ్లైన హోలి, కీలి జూలై 23న చరిత్ర సృష్టించారు. పైలట్లైన ఇద్దరూ కలిసి డెన్వర్ నుండి సెయింట్ లూయిస్కు ప్రయాణికుల విమానాన్ని నడిపారు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చెందిన 3658 విమానానికి హోలి కెప్టెన్గా ఉండగా ఆమె కుమార్తె కీలి కో పైలట్గా ఉన్నది.
ఈ సందర్భంగా ఫ్లైట్ కెప్టెన్ హోలి తన సంతోషాన్ని విమాన ప్రయాణికులతో పంచుకున్నారు. ‘ఇక్కడ ఉన్న మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మా ఇద్దరికీ, సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్కు చాలా ఉత్సాహామైన, చాలా ప్రత్యేకమైన రోజు. సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ డెక్లో తొలి తల్లీకూతుళ్లం’ అని అన్నారు. తమ కల నిజమైందని తెలిపారు. తొలుత తాను ఈ కెరీర్ను ఎంచుకుని ప్రేమించానని, తర్వాత తన కుమార్తె కూడా అదే మాదిరిగా ఈ కెరీర్ను ఎంచుకున్నదంటూ భావోద్వేగానికి గురయ్యారు. దీంతో ఆ విమానంలోని ప్రయాణికులు వీరిద్దరినీ అభినందించారు.
మరోవైపు సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ ఈ అరుదైన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తల్లీ, కుమార్తె అయిన హోలి, కీలి పైలట్లుగా రాణించడంతోపాటు, ఇద్దరూ కలిసి ఒకే విమానాన్ని నడిపి రికార్డు సృష్టించడాన్ని నెటిజన్లు అభినందించారు.
This mother-daughter duo made history as co-pilots on the flight deck of Southwest Airlines 🛩 pic.twitter.com/KeXCYsY5wU
— NowThis (@nowthisnews) August 3, 2022