అబుజా: నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో ప్రమాదవశాత్తూ పడవ మునిగిపోవడంతో సుమారు 150 మందికిపైగా ప్రయాణికులు గల్లంతయ్యారు. నైజీరియాలోని సెంట్రల్ నైజర్ రాష్ట్రం నుంచి వాయవ్య కెబ్బి రాష్ట్రానికి పడవ వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో పడవలో సామర్థ్యానికి మించి 180 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని గాస్కి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అబ్దుల్లాహి బుహారి వారా తెలిపారు. తాము 22 మందిని రక్షించామని, నలుగురు మరణించారని చెప్పారు. సుమారు 140 మంది గల్లంతయ్యారని వెల్లడించారు. వారంతా నీటిలో మునిగిపోయినట్లుగా భావిస్తున్నామన్నారు. గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.