వాషింగ్టన్: గత ఏడాది ఉక్రెయిన్పై రష్యా అటాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే సంవత్సర కాలంలో సుమారు లక్ష మందికిపైగా ఉక్రెయిన్ సైనికులు(Ukraine Soldiers) ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికాకు చెందిన పొలిటికో(Politico) వెబ్సైట్ తన కథనంలో పేర్కొన్నది. కీవ్ వద్ద తగినంత ఆయుధ సామాగ్రి లేదని, అనుభవం ఉన్న సైనికులు లేరని అమెరికా వెల్లడించింది. ఏడాది నుంచి ఉక్రెయిన్లో సుమారు లక్షకుపైగా సైనికులు చనిపోయినట్లు అమెరికా అధికారులు చెప్పిన విషయాన్ని పొలిటికో రాసింది.
బక్ముత్ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. డోనస్కీ(Donetsk) ప్రాంతంలో ఉన్న ఆర్టిమోవస్కీలో రష్యా దళాల(Russian Forces)కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, కానీ ఆ ప్రాంతాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకున్నట్లు పొలిటికో వెల్లడించింది. రష్యా ఆక్రమణ మొదలైన తర్వాత ఉక్రెయిన్లో సుమారు లక్షా 20 వేల మంది చనిపోయి ఉంటారని అమెరికా, యూరోప్ అధికారులు వాషింగ్టన్ పోస్టు(Washington Post)కు తెలిపారు.