ముంబైలో ఐసోలేషన్ కేంద్రం
న్యూఢిల్లీ, మే 23: ఐరోపా దేశాల్లో విజృంభించిన మంకీ పాక్స్ తాజాగా మధ్య ప్రాచ్య దేశాలకూ పాకింది. విదేశాల నుంచి ఇజ్రాయెల్కు వచ్చిన ఓ వ్యక్తికి వైరస్ సోకింది. తమ దేశంలో తొలి మంకీపాక్స్ కేసు నమోదైందని అధికారులు ప్రకటించారు. కాగా, మంకీపాక్స్ సోకిన వ్యక్తితో నేరుగా కాంటాక్ట్ అయితే 21 రోజుల పాటు ఐసోలేషన్లో ఉండాలని బ్రిటన్ అధికారులు సూచించారు. ఇటీవల స్పెయిన్, బెల్జియంలో జరిగిన ‘అసహజ లైంగిక’ రేవ్ పార్టీ కారణంగా మంకీ పాక్స్ ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ డేవిడ్ హేమన్ అనుమానం వ్యక్తం చేశారు.
మంకీ పాక్స్ వైరస్ ప్రబలడానికి ఆస్ట్రాజెనెకా (కొవిషీల్డ్) వ్యాక్సిన్ వేసుకోవడం కారణమంటూ కొందరు కుట్ర సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వ్యాక్సిన్లో చింపాంజీ వైరస్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమని శాస్త్రవేత్తలు కొట్టిపారేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మంకీపాక్స్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ కేసులు కనుక వస్తే చికిత్స అందించేందుకు ముంబైలోని కస్తూర్బా దవాఖానలో 28 పడకలతో ఐసోలేషన్ కేంద్రాన్ని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది.