JD Vance : పాకిస్థాన్ (Pakistan) రాజధాని ఇస్లామాబాద్ (Islamabad) వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే మరోసారి ఇరాన్ (Iran) తో సంప్రదింపులు జరగవచ్చని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొన్ని గంటల క్రితమే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్తో చర్చల విషయమై ఆమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చలు సఫలం కావాలంటే రెండు దేశాల మధ్య పరస్పర నమ్మకం ఉండాలని, కానీ అమెరికా-ఇరాన్ల (US-Iran) మధ్య అపనమ్మకం ఉన్నదని, ఆ అపనమ్మకం రాత్రికి రాత్రే పోయేది కాదని వాన్స్ అన్నారు.
యుద్ధం ముగించేందుకు ఇటీవల ఇరాన్-అమెరికా దేశాల మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ నెల 21వ తేదీతో ఆ రెండు వారాల గడువు ముగియనుంది. కాల్పుల విరమణ ఒప్పందం కుదరగానే ఇస్లామాబాద్లో రెండు దేశాల ప్రతినిధుల బృందాల మధ్య శాంతి చర్చలు జరిగాయి. అమెరికా తరఫున జేడీ వాన్స్ బృందం, ఇరాన్ తరఫున అబ్బాస్ అరాఘ్చీ బృందంలో చర్చల్లో పాల్గొన్నాయి. అయితే ఒకరి డిమాండ్లకు ఒకరు ఒప్పుకోక పోవడంతో చర్చలు విఫలమయ్యాయి.
దాంతో మరోసారి చర్చలు జరిపేందుకు రెండు దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్తో యుద్ధం ముగిసిపోయినట్లేనని తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కానీ వాన్స్ మాత్రం అపనమ్మకం రాత్రికి రాత్రే పోయేది కాదని వ్యాఖ్యానించారు. దాంతో ఇంతకూ రెండు దేశాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరుగుతాయా.. లేదా..? అనే విషయంలో సందిగ్ధం నెలకొన్నది. ఈ నెల 21 లోపు రెండు దేశాలు శాంతి ఒప్పందానికి రాకపోతే యుద్ధం మళ్లీ మొదలయ్యే అవకాశం ఉన్నది.