Miss Universe | మిస్ యూనివర్స్ పోటీలు అమెరికాలోని లూసియానా రాష్ట్రంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్ విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. అయితే, ఈ పోటీల్లో తనకు ఎదురైన అనుభవాలను రష్యా భామ అన్నా లిన్నికోవా తాజాగా పంచుకుంది. పోటీల సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ చెప్పుకొచ్చింది.
‘నాకు అది ఎంతో క్లిష్టమైన సమయం. పోటీలు ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ సోషల్మీడియా యూజర్ల నుంచి తీవ్రమైన బెదిరింపులు వచ్చాయి. తెలిసిన వారి నుంచి కూడా పలు కామెంట్లు వచ్చాయి. నేను ఎక్కడి నుంచి వచ్చానో తెలిశాక చాలామంది నన్ను దూరం పెట్టారు. మిస్ ఉక్రెయిన్, స్విట్జర్లాండ్ నుంచి వచ్చిన వారైతే నా నుంచి దూరంగా వెళ్లిపోయారు. ఆ సమయంలో మిస్ వెనెజులా మాత్రం నాతో ఆప్యాయంగా మెలిగింది. ఆ ప్రవర్తనే వెనెజులా భామను రెండో స్థానంలో నిలిచేందుకు దోహదపడి ఉండొచ్చు’ అని అన్నా లిన్నికోవా చెప్పుకొచ్చింది. అయితే ఈ పోటీలు అమెరికా, ఉక్రెయిన్ అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని ఆమె ఆరోపించింది.
ఈ ఏడాది జనవరి 15వ తేదీన న్యూ ఓర్లీన్స్లో 71వ ఎడిషన్ మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలే అంగరంగవైభవంగా జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం జనవరి 14న రాత్రి 8 గంటలకు (భారత కాలమానం ప్రకారం జనవరి 15 ఉదయం 6.30 గంటలకు) ప్రారంభమయ్యాయి. ఈ పోటీల గ్రాండ్ ఫినాలేలో విజేత బొన్ని గాబ్రియేల్ ప్రకాశవంతమైన గౌనులో తళుక్కున మెరిసింది. వజ్రాలు, క్రిస్టల్స్ పొదిగిన గౌన్ను ధరించి గాబ్రియేల్ వేదిక మీదకు వచ్చింది.
ఈ విశ్వసుందరి పోటీల్లో వెనెజులా భామ అమండా దుడామెల్ మొదటి రన్నరప్గా, డొమినికన్ రిపబ్లిక్కు చెందిన అండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్గా నిలిచారు. భారత్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి చెందిన దివితా రాయ్ ఈసారి విశ్వసుందరి పోటీల్లో పాల్గొన్నది. అయితే 80 దేశాల అందగత్తెలతో పోటీపడ్డ దివిత పై నుంచి 16వ స్థానానికి పరిమితమైంది.