ఖాట్మండు: నేపాల్ సంకీర్ణ సర్కారులో అప్పుడే ముసలం మొదలైంది. నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అధినేత పుష్పకమల్ దహల్ (ప్రచండ) నేతృత్వంలో సంకీర్ణ సర్కారు ఏర్పాటై సరిగ్గా రెండు నెలలైనా పూర్తికాకముందే విభేదాలు తలెత్తాయి. సంకీర్ణంలోని నాలుగో అతిపెద్ద పార్టీ (19 మంది ఎంపీలు) అయిన రాష్ట్రీయ సత్వంత్ర పార్టీ (ఆరెస్పీ) నేపాల్ క్యాబినెట్ నుంచి వైదొలిగింది. ఆ పార్టీకి చెందిన నలుగురు మంత్రులు పదవులకు రాజీనామా చేశారు.
అరెస్పీ అధ్యక్షుడు రబీ లామిచానె అధ్యక్షతన ఇవాళ ఆ పార్టీకి చెందిన 19 మంది ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీకి చెందిన మంత్రులు నలుగురు మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించారు. అనంతరం ఆరెస్పీ మంత్రులు ప్రధాని ప్రచండకు రాజీనామా లేఖలు సమర్పించారు. ఆరెస్పీ అధ్యక్షుడు లామిచానే ఎంపీ పదవిపై ఆ దేశ సుప్రీంకోర్టు అనర్హత వేటు వేయడంతో నేపాల్ సర్కారులో వివాదం రాజుకుంది.
సుప్రీంకోర్టు తీర్పు అనంతరం లామిచానే పలుమార్లు ప్రధాని ప్రచండతో భేటీ అయ్యారు. తనపై అనర్హత వేటు ఎత్తివేయకపోతే ప్రభుత్వం నుంచి వైదొలుగుతామని హెచ్చరించారు. అయినా ప్రచండ తన డిమాండ్ను నెరవేర్చకపోవడంతో లామిచానె ఇవాళ తన పార్టీ మంత్రులతో రాజీనామాలు చేయించారు. 2022 సాధారణ ఎన్నికల సందర్భంగా అఫిడవిట్లో లామిచానె సమర్పించిన పాస్పోర్టు చెల్లనిదిగా తేలడంతో నేపాల్ సుప్రీంకోర్టు అతని ఎంపీ సభ్యత్వంపై అనర్హత వేటు వేసింది.
రబీ లామిచానె నేపాల్ పాస్పోర్టుతోపాటు అమెరికా పాస్పోర్టును కూడా కలిగి ఉన్నాడు. ఇలా రెండు పాస్పార్టులు కలిగి ఉండటం నేపాల్ ప్రభుత్వ నియమాలకు విరుద్ధం. నేపాల్ పౌరుడు మరో దేశం సభ్యత్వం తీసుకోగానే అతను నేపాల్ పౌరసత్వాన్ని కోల్పోతాడు. అ ప్రాతిపదికన లామిచానె అమెరికా పౌరసత్వం పొందిగా అతని నేపాల్ పాస్పోర్టు చెల్లుబాటును కోల్పోయింది. దాంతో అతను ఎంపీ పదవికి అనర్హుడిగా నేపాల్ సుప్రీంకోర్టు తీర్పుచెప్పింది.