ప్రమాదకరమైన టాస్క్లతో హడలెత్తించిన బ్లూవేల్ చాలెంజ్, మోమో ఛాలెంజ్ అన్లైన్ క్రీడలు రేపిన గాయాల్ని ఇంకా పూర్తిగా మరిచిపోకముందే మరో డేంజరస్ గేమ్ కొత్తగా నెట్టింట్లో వైరల్గా మారింది. దీనికి ఆకర్షితులైన పలువురు గేమ్ టాస్క్ను పూర్తిచేయడంలో భాగంగా గాయాలపాలై దవాఖానల్లో చేరుతున్నారు. ఈ గేమ్ను వెంటనే నిషేధించాలని వైద్యులతో పాటు టీనేజర్ల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆ క్రీడనే ‘మిల్క్ క్రేట్ చాలెంజ్’.
ఎందుకు వద్దంటున్నారు?
ఈ చాలెంజ్లో వినియోగిస్తున్నవి ‘మిల్క్ క్రేట్లు’. ఇవి చాలా పలుచగా, తేలిగ్గా ఉంటాయి. పిరమిడ్గా పేర్చిన వీటిపై వ్యక్తులు నిలబడటం, నడవడం చాలా కష్టం. కిందపడే ప్రమాదమే ఎక్కువ. ఇప్పటివరకూ ఈ టాస్క్ను ప్రయత్నించిన వారిలో 99 శాతం మంది ఫెయిల్ అయ్యి.. గాయాలపాలయ్యారంటే ఇది ఎంత ప్రమాదకరమైన ఆటనో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా తదితర దేశాల్లో ఈ చాలెంజ్ పాపులర్గా నడుస్తున్నది. అసలే కరోనా సంక్షోభంతో దవాఖానల్లో వైద్య సేవల కొరత నెలకొన్న ఈ క్లిష్ట సమయంలో.. ‘మిల్క్ క్రేట్ చాలెంజ్’ ఆడి.. వందలాది మంది మెడ, చేతులు, కాళ్లు విరిగి.. గాయాలతో దవాఖానల్లో చేరుతుండటం వైద్యులకు అదనపు భారంగా మారుతున్నది.
నిషేధించవచ్చు కదా!
‘మిల్క్ క్రేట్ చాలెంజ్’ తొలుత టిక్టాక్లో వెలుగుచూసింది. ఈ గేమ్ బారిన పడి పలువురు గాయాలపాలవుతుండటంతో ఆ సంస్థ ఈ గేమ్ను నిషేధించింది. అయితే, అప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్లో ఈ చాలెంజ్ లింక్స్ విరివిగా షేర్ అయ్యాయి. భారత్లో టిక్టాక్పై నిషేధం ఉన్నప్పటికీ, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఈ చాలెంజ్ విస్తరిస్తుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏమిటీ ‘మిల్క్ క్రేట్ చాలెంజ్’?
పాల ప్యాకెట్లను నిల్వ ఉంచే క్రేట్లను పిరమిడ్ ఆకారంలో ఒకే వరుసలో కనీసం 8 అడుగుల ఎత్తులో పేర్చాలి. టాస్క్లో పాల్గొనే వ్యక్తి ఒకవైపు నుంచి క్రమంగా ఆ క్రేట్ల పిరమిడ్ను ఎక్కుతూ పైనున్న చివరి క్రేట్పై స్థిరంగా నిలబడాలి. అనంతరం.. అక్కడి నుంచి మరోవైపునకు క్రమంగా దిగాలి. ఈ టాస్క్ పూర్తయ్యేంత వరకూ క్రేట్ పిరమిడ్ కూలిపోకూడదు. వ్యక్తి కింద పడకూడదు.