ఉక్రెయిన్పై రష్యా బాంబులతో విరుచుకుపడుతోంది. మూడో రోజూ ఇది కొనసాగుతోంది. పలు నగరాలు, సైనిక స్థావరాలు, ప్రజలు నివాసముండే అపార్ట్మెంట్లపై కూడా రష్యా సైన్యం దాడులకు దిగింది. దీంతో ప్రజలందరూ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బంకర్లు, మెట్రో స్టేషన్లు… ఇలా మరి కొన్ని రహస్య స్థావరాల్లో తలదాచుకుంటున్నారు. మరి కొందరు కార్లతో సహా పలు వాహనాల్లో వలస వెళ్లిపోతున్నారు. అయితే.. ఉక్రెయిన్ అధికారుల ప్రకారం ఇప్పటి వరకూ ఓ లక్ష మంది ఉక్రెయిన్ పౌరులు వలస వెళ్లిపోయారని పేర్కొంటున్నారు.
రొమానియా, పోలాండ్, మోల్డోవా స్లోవాకియా హంగేరీ ప్రాంతాలకు తరిలిపోయారు. వీరి బాధ వర్ణనాతీతం. అంతర్జాతీయ శరణార్థుల ఏజెన్సీ ప్రకారం ఇప్పటి వరకూ ఓ లక్ష మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోయారని తెలుస్తోంది. పరిస్థితి ఇంకా క్షీణిస్తే మాత్రం ఈ సంఖ్య 40 లక్షలు దాటే ప్రమాదముందని ఆ సంస్థ పేర్కొంది.
అయితే ఈ వలస వెళ్లే వారిలో అత్యధికులు మహిళలే వుంటున్నారు. రష్యాకు వ్యతిరేకంగా ప్రతీ ఉక్రెయిన్ పౌరుడూ పోరాడాల్సిందేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకునే ఉక్రెయిన్లోని పురుషులు తమ తమ స్థావరాల్లోనే ఉండిపోతున్నారని తెలుస్తోంది.