హైదరాబాద్: ఏండ్ల కొద్దీ ఓ మారుమూల దీవిలో ఏకాంతంగా నివసించి అకస్మాత్తుగా జనం రద్దీతో ఉండే నగరానికి వస్తే ఎలా అనిపిస్తుందో ఒకసారి ఊహించుకోండి..! గుండెల్లో గంటలు మోగుతున్న ఫీలింగ్ ఉంది కదా..? మీకు టామ్ హ్యాంక్స్ నటించిన క్యాస్ట్ అవే సినిమా గుర్తుకొస్తున్నది కదా..? ఔను, నిజ జీవితంలో కూడా సరిగ్గా అలాంటి ఘటనే చోటుచేసుకున్నది. బుడెల్లిలోని సార్డినియన్ దీవిలో మౌరో మొరాండి అనే 82 ఏండ్ల వ్యక్తి ఒకటి రెండు కాదు ఏకంగా 33 ఏండ్లపాటు ఏకాంతంగా జీవనం గడిపాడు.
ఈ 33 ఏండ్లలో అతని నేస్తాలు అడవి పక్షులు, అడవి పిల్లులు మాత్రమే. వాటితోనే అతని సావాసం కొనసాగింది. ఒక్కసారి ఊహించుకోండి.. అతను ఈ 33 ఏండ్లలో కనీసం ఒక్కరంటే ఒక్క మనిషితో కూడా కలువలేదు, మాట్లాడలేదు. ఆ పరిస్థితి ఎలా ఉంటుంది..? అలాంటి మౌరో ఇప్పుడు తిరిగి నగరానికి చేరి బలవంతంగానో లేదంటే ఇష్టంగానో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. ఇటీవల స్థానిక అధికారులు సార్డినియన్ దీవిని ఎన్విరాన్మెంటల్ అబ్జర్వేటరీగా మార్చాలని నిర్ణయించడంతో.. మౌరోకు ఆ దీవిలోని తన ఆవాసాన్ని ఖాళీ చేయడం తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది.
దాంతో మౌరో గత మే నెలలో లా మద్దలీనా దీవికి వెళ్లాడు. అక్కడ తన పెన్షన్ డబ్బులతో ఓ ఇల్లు కొనుక్కున్నాడు. క్రమంగా తన ఇరుగుపొరుగు వారితో మాట్లాడటం మొదలుపెట్టాడు. కాగా, తన జీవితంలో వచ్చిన ఆకస్మిక మార్పు గురించి మౌరో ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. నేను సుదీర్ఘ కాలం సార్డినియన్ దీవిలో ఏకాంత జీవనం గడిపాను. బుడెల్లి దీవికి వచ్చిన తర్వాత చాలా రోజులు నేను ఇతరులతో మాట్లాడటానికి ఇష్టపడలేదు. ఇప్పుడు నా జీవితం కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడిప్పుడే ఇతరులతో మాట్లాడేందుకు, వారితో కలిసిపోయేందుకు ప్రయత్నిస్తున్నా అని చెప్పాడు.
మౌరో 1989లో సముద్ర మార్గం గుండా ఇటలీ నుంచి పోలినేషియాలోని తన స్వస్థలానికి వెళ్తుండగా సార్డినియన్ దీవిని చూశాడు. ఆ అందాల దీవిలోని సుందర దృశ్యాలు, వినసొంపైన శబ్దాలు తనను అక్కడే ఉండిపోయేలా చేశాయని చెప్పాడు. కానీ ఆయన ఇన్నేండ్ల తర్వాత ఇప్పుడు ఆ దీవిని ఖాళీ చేసి నగరంలో జనం మధ్య కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది. అయితే, ఒక మనిషి తన జీవితకాలంలో రెండోసారి కూడా కొత్త జీవితం ప్రారంభించవచ్చు అనడానికి తానే సజీవ సాక్ష్యమన్నాడు మౌరో.
మీరు కూడా 80 ఏండ్లు దాటినప్పటికీ మళ్లీమళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చని మౌరో చెబుతున్నాడు. ఎందుకంటే ఆ కొత్త జీవితంలో ఎన్నో కొత్త అనుభవాలు తెలిసొస్తాయని, పూర్తిగా భిన్నమైన ప్రపంచాన్ని చూసే అవకాశం దొరుకుతుందని మైరో అభిప్రాయపడ్డాడు. ఇదిలావుంటే, దీవిలో తన అనుభవం గురించి మౌరో ఒక పుస్తకం కూడా రాసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.