Maryam Nawaz: పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు ముఖ్యమంత్రిగా ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తనయ మరియం నవాజ్ ఎంపికయ్యారు. దాంతో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఎంపికైన తొలి మహిళగా ఆమె చరిత్రలోకి ఎక్కారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) పార్టీ నుంచి పంజాబ్ ప్రావిన్స్ సభ్యురాలిగా గెలిచిన ఆమెను ఆ పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలో దించింది. సున్నీ ఇత్తేహాద్ కౌన్సిల్ (SIC) నుంచి రాణా ఆఫ్తాబ్ అహ్మద్ సీఎం పదవికి పోటీపడ్డారు.
ఇవాళ పంజాబ్ అసెంబ్లీలో సీఎం ఎంపికపై ఓటింగ్ జరుగగా మరియం నవాజ్కు 220 ఓట్లు వచ్చాయి. సున్నీ ఇత్తేహాద్ కౌన్సిల్ సభ్యులు అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడంతో మరియం ప్రత్యర్థి రాణా అఫ్తాబ్కు ఒక్క ఓటు కూడా రాలేదు. కొత్తగా ఎన్నికైన స్పీకర్ మాలిక్ మహ్మద్ అహ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించారు.
కాగా, పంజాబ్ అసెంబ్లీలోని మొత్తం 371 స్థానాలకుగాను ఇటీవలే 321 మంది సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అంతకుముందు జరిగిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా పీఎంఎల్-ఎన్ పార్టీకి చెందిన సభ్యులే విజయం సాధించారు. మాలిక్ అహ్మద్ఖాన్ స్పీకర్గా, మాలిక్ జహీర్ అహ్మద్ డిప్యూటీ స్పీకర్గా ఎంపికయ్యారు.
మరియం నవాజ్ పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె. ఈ మె 1992లో సఫ్దార్ అవాన్ను వివాహం చేసుకుంది. ఆ సమయంలో అతను పాకిస్థాన్ ఆర్మీలో కెప్టెన్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ ప్రధాని అయినప్పుడు ఆయనకు సెక్యూరిటీ అధికారిగా అవాన్ పనిచేశారు. మరియం-అవాన్ దంపతులు ముగ్గురు పిల్లలు ఉన్నారు.
మరియం నవాజ్ 2012లో రాజకీయాల్లో వచ్చారు. 2013లో పీఎంఎల్-ఎన్ ఎన్నికల ప్రచార ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం అదే ఏడాది ప్రైమ్ మినిస్టర్ యూత్ ప్రోగ్రామ్ చైర్మన్గా నియమితులయ్యారు. అయితే ఆమె ఎన్నిక వివాదాస్పదం కావడంతో 2014లో పదవికి రాజీనామా చేశారు. తాజా ఎన్నికల్లో ఆమె పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీకి, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీకి పోటీచేసి రెండు చోట్ల విజయం సాధించారు.
ఇప్పుడు పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా ఎంపిక కావడంతో పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ స్థానానికి ఆమె రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆమె పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యత్వానికిగానీ, పంజాబ్ ప్రావిన్షియల్ అసెంబ్లీ సభ్యత్వానికిగానీ పోటీపడటం ఇదే తొలిసారి. పోటీ పడిన తొలిసారే ఆమె రెండు చోట్లా విజయం సాధించడం గమనార్హం.