శాన్ఫ్రాన్సిస్కో: ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ సేవలు కొన్ని గంటల పాటు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆ అంతరాయం వల్ల వాటి ఓనర్ మార్క్ జుకర్బర్గ్ ఆస్తుల విలువ పడిపోయింది. కొన్ని గంటల్లోనే జుకర్బర్గ్ వ్యక్తిగత ఆస్తుల సుమారు 7 బిలియన్ల డాలర్లు పడిపోయినట్లు తెలుస్తోంది. సోమవారం సోషల్ మీడియా షేర్లు 4.9 శాతం క్షీణించాయి. దీంతో గత సెప్టెంబర్ నుంచి షేర్ల పతనం 15 శాతానికి చేరుకున్నది. ఒక్కసారిగా జుకర్బర్గ్ ఆస్తులు పడిపోవడంతో.. ప్రపంచ సంపన్నుల జాబితాలోనూ ఆయన ర్యాంక్ పడిపోయింది. ప్రస్తుతం సంపన్నుల జాబితాలో జుకర్బర్గ్ అయిదవ స్థానంలో ఉన్నారు. బిల్ గేట్స్ కన్నా తక్కువ ర్యాంక్కు మార్క్ దిగజారారు. కేవలం స్టాక్లు క్షీణించడం వల్లే ఆయన సుమారు 121.6 బిలియన్ల డాలర్లు కోల్పోయారు.
దాదాపు ఆరు గంటల పాటు ఎఫ్బీ, వాట్సాప్, ఇన్స్టాలు పనిచేయలేదని ఫేస్బుక్ చెప్పింది. కాన్ఫిగరేషన్ ఛేంజ్లో సమస్య వల్ల బ్లాకౌట్ అయినట్లు ఎఫ్బీ తెలిపింది. ఆ సమయంలో వెబ్సైట్లో కానీ, స్మార్ట్ఫోన్ యాప్ల్లో కానీ ఆ మూడు సేవలను వినియోగదారులు అందుకోలేకపోయారు. సోషల్ మీడియాలో బ్లాకౌట్లను గుర్తించే డౌన్డిటెక్టర్ దీనిపై స్పందించింది. గతంలోనూ ఎన్నడూ ఇలాంటి లోపాన్ని చూడలేదన్నది. ప్రపంచ వ్యాప్తంగా 10.6 మిలియన్ల సంఖ్యలో సమస్యలు వచ్చినట్లు డౌన్డిటెక్టర్ చెప్పింది. జీఎంటీ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు సర్వీసులు నిలిచిపోయాయి. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు మళ్లీ సేవల పునరుద్దరణ జరిగింది. ఎఫ్బీ డౌన్ కావడం వల్ల యూజర్ డేటా ఏమైనా చౌర్యానికి గురైందా అన్న విషయంలో ఇంకా ఆధారాలు లభించలేదు.