బ్యాంకాక్, అక్టోబర్ 6: థాయ్లాండ్లో ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఓ దుండగుడు బాలల సంరక్షణ కేంద్రంపై దాడికి దిగి పసిపిల్లలను ఊచకోత కోశాడు. రెండు తుపాకులతో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 24 మంది చిన్నారులు సహా 37 మంది మృత్యువాత పడ్డారు. పిల్లలను కాపాడేందుకు కొంతమంది టీచర్లు తమ ప్రాణాలను అడ్డుపెట్టారు. కాల్పుల తీవ్రతకు అద్దం పడుతూ.. గోడలపై ఉన్న రంగురంగుల బొమ్మలు, పిల్లల ఆట వస్తువులు నెత్తురు పులుముకున్నాయి. చిన్నారులు, టీచర్లు రక్తం మడుగులో కనిపించారు. మృతుల్లో రెండేండ్లలోపు చిన్నారులు అధికంగా ఉన్నారు. పసిబిడ్డను ఎత్తుకున్న ఓ మహిళా టీచర్.. కాల్పుల్లో విగతజీవిగా కనిపించడం అందరినీ కలిచివేసింది.
స్కూల్ ఆవరణ అంతా భీతావహ పరిస్థితి నెలకొంది. తూటాలకు బలైన చిన్నారులను చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన ఈశాన్య ప్రాంతంలోని నాక్లాంగ్ జిల్లా నాగ్బు లంఫూ ప్రావిన్స్లో గురువారం మ ధ్యాహ్నం 12.30 గంటలకు జరిగింది. చైల్డ్కేర్ సెంటర్లో నరమేధానికి పాల్పడిన ఆ దుండగుడు ఆ తరువాత నేరుగా ఇంటికెళ్లి తన భార్య, బిడ్డను కాల్చి చంపి.. ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. థాయిలాండ్ దేశ చరిత్రలోనే ఇది ఘోరమైన కాల్పుల ఘటన. నిందితుడిని మాజీ పోలీస్ అధికారి పాన్య ఖమ్రాప్గా పోలీసులు అనుమానిస్తున్నారు. దుండగుడు స్కూల్ నుంచి తప్పించుకునేటప్పుడు కారులోంచి పౌరులపై కాల్పులు జరిపాడు.