కాన్బెర్రా: ఒక యువతిని మాజీ ప్రియుడు దారుణంగా హత్య చేశాడు. ఆమెను వైర్లతో కట్టేసి సజీవంగా గోతిలో పాతిపెట్టాడు. ఆస్ట్రేలియాలో ఈ దారుణ సంఘటన జరిగింది. భారత్కు చెందిన 21 ఏళ్ల జాస్మిన్ కౌర్ (Jasmeen Kaur) ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో నర్సింగ్ కోర్సు చదువుతున్నది. 2021 మార్చిలో భారత సంతతికి చెందిన తారిక్జోత్ సింగ్ ఆ యువతిని కిడ్నాప్ చేశాడు. ఆమెను కారు డిక్కీలో ఉంచి ఫ్లిండర్స్ రేంజ్కు తీసుకెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఒక గొయ్యి తవ్వాడు. జాస్మిన్ కౌర్ కళ్లకు గంతలు కట్టాడు. ఆమె కాళ్లు, చేతులను వైర్లతో కట్టేశాడు. ఆ యువతిని సజీవంగా గోతిలో పడేసి మట్టితో కప్పేశాడు. కొన్ని గంటలపాటు నరకయాతన అనుభవించిన జాస్మిన్ ఊపిరి ఆడక చనిపోయింది.
కాగా, జాస్మిన్ కౌర్ మిస్సింగ్పై ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో ఆస్ట్రేలియా పోలీసలు దర్యాప్తు జరిపారు. నిందితుడు తారిక్జోత్ సింగ్ను గత ఏడాదిలోనే అరెస్ట్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టు విచారణ సందర్భంగా నేరాన్ని అతడు ఒప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో జాస్మిన్ కౌర్ మృతదేహం అవశేషాలను గోతి నుంచి పోలీసులు వెలికితీశారు. మృతదేహం కళ్లకు గంతలు, కాళ్లు, చేతులను వైర్లతో కట్టి ఉండటం చూసి షాక్ అయ్యారు. టేపులు, వైర్లు కూడా ఆ గోతిలో కనిపించాయి. ఇది అసాధారణ స్థాయి క్రూరత్వమని ప్రాసిక్యూటర్ తెలిపారు.
మరోవైపు రిలేషన్షిప్ బ్రేక్ డౌన్ను సహించని తారిక్జోత్ సింగ్ తన కుమార్తెపై ఈ విధంగా ప్రతీకారం తీర్చుకున్నాడని జాస్మీన్ కౌర్ తల్లి ఆరోపించింది. తన కుమార్తె అతడ్ని వంద సార్లు నిరాకరించిందని, దీంతో ఆమెను కిడ్నాప్ చేసి సజీవంగా గోతిలో పాతిపెట్టి దారుణంగా చంపాడని వాపోయింది. తన కుమార్తెను నరకయాతనకు గురి చేసి దారుణంగా హత్య చేసిన అతడ్ని ఎప్పటికీ క్షమించబోనని తెలిపింది. కాగా, నిందితుడు తారిక్జోత్ సింగ్కు కోర్టు జీవితకాల జైలు శిక్ష విధించవచ్చని ప్రాసిక్యూటర్ వెల్లడించారు.