బమాకో: జిహాదీలు జరిపిన ఆత్మాహుతి దాడిలో.. మాలి దేశ రక్షణ శాఖ మంత్రి(Defence Minister) సాదియో కమరా మృతిచెందారు. దేశ రాజధాని బమాకోకు సమీపంలో ఉన్న అతని నివాసంపై అటాక్ జరిగింది. జిహాదీ మిలిటెంట్లు, వేర్పాటువాదులు కలిసి దేశవ్యాప్తంగా హింసకు పాల్పడుతున్నారు. తీవ్రవాదుల దాడిలో గాయాలపాలైన రక్షణ మంత్రి ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ ఛానల్ కన్ఫర్మ్ చేసింది. మిలిటరీ జుంటా అధినేత జనరల్ అసిమి గోయిటాను ప్రస్తుతం సురక్షిత ప్రాంతానికి తరలించారు. చాన్నాళ్లుగా మాలి దేశంలో అల్ఖయిదా, ఇస్లామిక్ స్టేట్తో పాటు అజావాద్ లిబరేషన్ ఫ్రంట్కు చెందిన గ్రూపుల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి.
కటి ప్రాంతంలో ఉన్న రక్షణ మంత్రి ఇంటిపై అల్ఖయిదా అనుబంధ మిలిటెంట్లు దాడి చేశారని, ఆ దాడుల్లో కమరా ఫ్యామిలీకి చెందిన మరో ముగ్గురు కూడా హతమైనట్లు తెలిసింది. మినిస్టర్ నివాసంపైకి ఆయుధాలతో నిండిన వాహనం దూసుకువచ్చిందని, ఓ సూసైడ్ అటాకర్ ఆ వాహనాన్ని నడిపినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఇసా ఔస్మనే కౌలిబలీ తెలిపారు. మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపామని, కొందర్ని హతమార్చామని, కానీ గాయాల వల్ల రక్షణ మంత్రి ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.