వాషింగ్టన్: మొరాకోలో (Morocco) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో (11.11 గంటలకు) మొరాకోలోని మర్రకేష్ (Marrakesh) ప్రాంతంలో శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.8గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. మర్రకేష్కు 71 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 18.5 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది.
రాజధాని రాబాట్కు (Rabat) 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాబాత్ నుంచి మర్రకేష్ వరకు వచ్చిన భారీ భూకంపంతో ప్రజలు వణికిపోయారు. ఇండ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. భయంభయంగా రాత్రంతా రోడ్లపైనే గడిపారు. భూకంపం ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. భూకంపం వల్ల భారీ ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఒక్క మర్రకేష్లోనే 27 మంది చనిపోయారని పేర్కొన్నారు.
కాగా, 2004లో అల్ హొసీమాలో వచ్చిన భూకంపంతో 628 మంది మరణించారు. మరో 926 మంది గాయపడ్డారు. ఇక 1980లో ఎల్ అస్నామ్లో 7.3 తీవ్రతతో భూమి కంపించింది. దీనివల్ల 2500 మంది మృత్యువాతపడగా, 3 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.