పెరు: ఒకప్పుడు ప్రపంచ వింతల్లో ఒకటైన పెరులోని మాచు పిచ్చు( Machu Picchu ) కార్బన్ న్యూట్రల్ సర్టిఫికెట్ అందుకున్న తొలి అంతర్జాతీయ పర్యాటక స్థలంగా గుర్తింపు పొందింది. పర్యావరణహిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే గ్రీన్ ఇనిషియేటివ్ సంస్థ సహజ అభయారణ్యమైన మాచు పిచ్చుకు ఈ సర్టిఫికెట్ ఇచ్చింది. అంతేకాదు పర్యావరణ స్థిరత్వం విషయంలో ఈ మాచు పిచ్చును ఓ అంతర్జాతీయ సూచికగా గుర్తించింది.
అసలేంటీ సర్టిఫికెట్?
ఈ సర్టిఫికేషన్ ప్రకారం.. ఈ ప్రాంతంలో కార్బన్డైఆక్సైడ్ ఉద్గారాలను భారీగా తగ్గించాల్సి ఉంటుంది. 2030లోపు సీఓ2 ఉద్గారాలను 45 శాతం మేర, 2050 వరకూ 100 శాతం తగ్గించాలి. ఇప్పటికే మాచు పిచ్చు ఎన్నో పర్యావరణహిత కార్యక్రమాల ద్వారా ఈ సర్టిఫికెట్ను సాధించింది. పెరులోని ఏకైక సేంద్రీయ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ ఈ మాచు పిచ్చులోనే ఉంది. ఇక్కడ చెత్తను సహజ బొగ్గుగా మారుస్తారు. అక్కడి ఇళ్లు, రెస్టారెంట్లు పారేసే కూరగాయల వ్యర్థాల నుంచి బయోడీజిల్, గ్లిజరిన్లను ఉత్పత్తి చేస్తున్నారు. అంతేకాదు ఇక్కడ తిరిగి అడవులను పెంచే కార్యక్రమం కూడా జోరుగా సాగుతోంది. నేషనల్ సర్వీస్ ఆఫ్ ప్రొటెక్టెడ్ నేచురల్ ఏరియాస్ ఆధ్వర్యంలో 10 లక్షల మొక్కలను నాటారు.