వాషింగ్టన్: ఒంటరితనం(Loneliness) ఎంత ప్రమాదరకరమైందో చెప్పడం కష్టమే. కానీ అమెరికా సర్జన్ జనరల్ డాక్టర్ వివేక్ మూర్తి దీనిపై ఓ రిపోర్టును తయారు చేశారు. అమెరికన్లను ఒంటరితనం వేధిస్తున్నట్లు ఆయన తన స్టడీ రిపోర్టులో తెలిపారు. ఒంటరితనాన్ని అనుభవించడం అంటే.. రోజుకు 15 సిగరెట్లు తాగితే ఎంత నష్టం జరుగుతుందో, ఒంటరితనం కూడా అంతే ప్రమాదకరమన్నారు. అమెరికా యువతలో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు ఆయన చెప్పారు. దీనిపై 81 పేజీల రిపోర్టును తయారు చేశారు. ఒంటరితనం ఇప్పుడు అమెరికాను పీడిస్తున్న మహమ్మారి అని ఆయన తన నివేదికలో పేర్కొన్నారు.
సాధారణంగా ప్రజలు అందరూ ఒంటరితనం ఫీలింగ్లో ఉంటారని, అది ఆకలి, దాహాం లాంటిదే అని, బ్రతకడానికి కావాల్సింది ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుందని మూర్తి తన రిపోర్టులో తెలిపారు. అమెరికాలో మిలియన్ల సంఖ్యలో ప్రజలు ప్రస్తుతం ఒంటరితనంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఇది సరైంది కాదు అని, ఈ అంశంలో ప్రజలకు అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒంటరితనంపై అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఈ డిక్లరేషన్ చేసినట్లు చెప్పారు.
అమెరికన్లు ప్రార్థనా మందిరాలు, కమ్యూనిటీ సంస్థలకు వెళ్లడంలేదని, ఇటీవల కాలం కుటుంబసభ్యులకు కూడా దూరంగా ఉంటున్నారని, దీంతో వారిలో ఒంటరితనం ఫీలింగ్స్ వస్తున్నాయని పరిశోధనలో తేలినట్లు మూర్తి తెలిపారు. గడిచిన 60 ఏళ్ల కాలంలో అమెరికాలో ఒంటరిగా జీవించే ఇండ్ల సంఖ్య డబుల్ అయినట్లు చెప్పారు.
అయితే కోవిడ్ సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. స్కూళ్లు, ఆఫీసులు మూసివేయడంతో.. లక్షల సంఖ్యలో అమెరికన్లు ఇంటికే పరిమితం అయ్యారు. దీంతో వాళ్లు బంధువులు, స్నేహితులకు దూరం అయ్యారని తన రిపోర్టులో తెలిపారు. 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఒంటరితనం ఎక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తించారు. ఈ ఏజ్ గ్రూపులో ఉన్న వారు ఫ్రెండ్స్తో గడిపే సమయాన్ని 70 శాతం తగ్గించినట్లు తెలుస్తోందన్నారు. ఒంటరిగా ఉన్నవారిలో డిప్రెషన్, ఆవేశం, మతిమరుపు లాంటివి ఎక్కువయ్యే ఛాన్సు ఉందని మూర్తి తన రిపోర్టులో తెలిపారు.