Rishi Sunak | బ్రిటన్ ప్రధాని పదవికి జరుగుతున్న ఎన్నికల ప్రక్రియ చరమాంకానికి చేరుకుంటున్నది. ప్రధాని పదవికి బోరిస్ జాన్సన్ రాజీనామా చేయడంతో ఆయన క్యాబినెట్లో మంత్రులుగా పని చేసిన రిషి సునాక్, లిజ్ ట్రస్ ప్రధాన పోటీదారులుగా నిలిచారు. తొలుత రిషి సునాక్, లిజ్ ట్రస్ మధ్య విజయావకాశాలు 60-40 గా నిలిచాయి. కానీ, క్రమంగా పరిస్థితులు మారుతున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీలో సభ్యుల్లో 90 శాతం మంది లిజ్ ట్రస్ను విశ్వసిస్తున్నారని స్మార్కెట్ అనే సంస్థ అంచనాలో తేలింది. ఇద్దరు ప్రధాన ప్రత్యర్థులు పాల్గొన్న టీవీ చానెళ్ల చర్చాగోష్టుల్లో రిషి సునాక్ను లిజ్ ట్రస్ వెనక్కు నెట్టేశారని తెలుస్తున్నది. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను ఆకట్టుకునే రీతిలో లిజ్ ట్రస్ ప్రసంగాలు ఉన్నాయని సమాచారం.
కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో మెజారిటీ సభ్యుల విశ్వాసాన్ని చూరగొన్న రిషి సునాక్.. పార్టీ సభ్యుల మదిని గెలుచుకోవడంలో వెనుకబడినట్లు స్మార్కెట్స్ పొలిటికల్ మార్కెట్స్ అధిపతి మాథ్యూ షాడిక్ చెప్పారు. కేవలం 10 శాతం మంది మద్దతు మాత్రమే రిషి సునాక్కు లభిస్తుందన్నారు. వచ్చే వారం నుంచి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులకు బ్యాలెట్ పత్రాలు పంపిణీ ప్రారంభిస్తారు.సుమారు 1.75 లక్షల మంది పార్టీ సభ్యులకు ఓటు హక్కు ఉందని తెలుస్తున్నది. వీరిలో మెజారిటీ సభ్యుల మద్దతు లభించిన వారే బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారు.
పలు వివాదాల్లో చిక్కుకోవడంతో బోరిస్ జాన్సన్ తన ప్రధాని పదవికి ఈ నెల ఏడో తేదీన రాజీనామా చేశారు. దీంతో తదుపరి ప్రధాని ఎన్నిక కోసం కన్జర్వేటివ్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. పార్టీ అధ్యక్ష పదవికి, ప్రధాని పదవికి మొదలైన పోటీలో తొలుత 11 మంది బరిలో నిలిచారు. అధికార పార్టీ ఎంపీల మధ్య జరిగిన పలు రౌండ్ల ఎన్నికల్లో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్ ప్రధాన ప్రతర్థులుగా నిలిచారు.
ఇప్పటికే దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగిన టీవీ చానెళ్ల చర్చాగోష్టుల్లో పాల్గొన్న రిషి సునాక్, లిజ్ ట్రస్.. సాధారణ సభ్యుల మద్దతు సంపాదించుకునేందుకు ఆరు వారాలు దేశమంతా పర్యటిస్తారు. వచ్చేవారం బ్యాలెట్ల పంపిణీ ప్రారంభం అవుతుంది. సెప్టెంబర్ రెండో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తమ బ్యాలెట్ పత్రాలను సమర్పించాల్సి ఉంది. సెప్టెంబర్ ఐదో తేదీన తుది ఫలితాలు వెలువడతాయి. టోరీల మద్దతును రిషి సునాక్ కూడగట్టగలరా.. లేదా.. అన్నది అప్పుడే తేలుతుంది.